Food Quality :రోజూ మనం ఉదయం లేవగానే టిఫిన్ చేయడం కోసం బయటకు వెళ్లి దోసెలు, పూరీలు, బోండాలు, వడలు తింటాం. సాయంత్రం అయితే చాలు పానీపూరి, కట్ మిర్చి ఇలా రకరకాల ఆహార పదార్థాలను ఇష్టపడి తింటాం. అయితే వాటి తయారీకి వినియోగించే నూనె, పదార్థాలు స్వచ్ఛమైనవేనా అని ఆలోచించం. రుచి కోసం తిని, అనంతరం అనారోగ్యం బారిన పడతాం. కల్తీ, వినియోగించిన నూనె మళ్లీ వాడటం వల్ల రోగాలు వస్తాయి.
అవి ఎలాగో చూసేద్దాం.
- పానిపూరీ వెంట ఇచ్చే నీటిలో పలుమార్లు చేతులు ముంచుతుంటారు. ఇలా చేయడం వల్ల నీరు కలుషితమయ్యి, రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది.
- రుచి కోసం కొందరు బ్రిలియంట్ బ్లూ, సన్సెట్ ఎల్లో, టైట్రాజైన్ తదితర వాటిని కలుపుతూ ఉంటారు.
- వంట నూనెను ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల సాంద్రత పెరిగి చిక్కగా మారుతుంది. అలాంటి నూనెతో తయారు చేసే ఆహార పదార్థాలు (మిర్చీలు, పూరీలు, బోండాలు, వడలు ఇతర) తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- హోటళ్లలో వంటలు చేసే వారు ఆప్రాన్ను తప్పకుండా ధరించాలి. తలకు టోపి, చేతి తొడుగులు వేసుకుని వంట చేయాలి. ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. కొందరు రోడ్ల పక్కనే ఖాళీ స్థలాలను అడ్డాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. దీని వల్ల రోడ్లపైన దుమ్ము ఆహార పదార్థాలపై పేరుకుపోతుంది.
- ఆహార భద్రత ప్రమాణాల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా) రిజిస్ట్రేషన్తో పాటు ధ్రువీకరణ పత్రాలు చాలా మంది వద్ద లేవు.
అవగాహన కల్పించాం :ఆహార కల్తీ నిరోధక శాఖ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సహాయ అధికారి విజయ్కుమార్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా నాలుగు నెలల క్రితం మహబూబ్నగర్ పరిధిలో 300 మంది వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించామని తెలిపారు. తనిఖీలు చేస్తున్నామని, సిబ్బంది సమస్య వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. పానీపూరిలో ఎలాంటి రంగులు కలపరని, నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.