Gold Theft Case Solved: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం అత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ నెల 15వ తేదీ జరిగిన అయిదు కిలోల బంగారం చోరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల మేరకు, మంగళగిరికి చెందిన దీవి రాము విజయవాడలో జ్యువెల్లరీ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో మేనేజర్గా పని చేసే దీవి నాగరాజు రోజు ఈనెల 15వ తేదీన రాత్రి సుమారు 4 కోట్ల విలువైన 5 కేజీల బంగారు ఆభరణాలను బ్యాగ్లో పెట్టుకుని స్కూటీపై వస్తున్నాడు. ఆ సమయంలో ఆత్మకూరు బైపాస్లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని యువకులు స్కూటీకి తగిలించిన బ్యాగ్ లాక్కుని పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్లతో పాటు బాధితుడి కదలికలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. నాగరాజు తన స్నేహితులతో కలిసి చోరీకి వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, చెల్లికి వివాహం చెయ్యాలంటూ తన స్నేహితులైన నవీన్, లోకేశ్, భరత్, సాయి అనే నలుగురు స్నేహితులను నమ్మించి ఈ చోరీ కథ నడిపించాడు. ఆభరణాలు చోరీ చేసేందుకు తనకు సహకరించాలని కోరాడు. మొదట వారు పోలీసులకు భయపడి నిరాకరించారు. దీంతో నాగరాజు మీకేం ఇబ్బంది లేదని, అసలు కేసు లేకుండా చూసుకుంటానని వారిని ఒప్పించాడు.
ఈ వ్యవహారంలో భరత్ కీలకంగా వ్యవహరించాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం వారు నాగరాజు బైక్ను భరత్, మరో వ్యక్తి అడ్డగించి బంగారం బ్యాగ్తో ఉడాయించారు. దాన్ని స్థానికంగా నివాసం ఉండే లోకేశ్ ఇంట్లో ఉంచారు. నేరవిభాగం ఏఎస్పీ సుప్రజ పర్యవేక్షణలో డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టి, ఆరు రోజుల వ్యవధిలోనే చోరీకి గురైన బంగారంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.