ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముళ్ల కర్రలతో చితకబాదారు' - వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ - GANJA BATCH ATTACK YOUTH

గంజాయి సరఫరా గురించి పోలీసులకు సమాచారమిచ్చాడనే అనుమానంతో దాడి - చిత్రహింసలకు గురిచేసిన యువకులు

GANJA BATCH ATTACK YOUTH
GANJA BATCH ATTACK YOUTH (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 10:05 AM IST

GANJA BATCH ATTACK ON YOUTH: 'నేను ఏ తప్పు చేయలేదు. మీ గంజాయి వ్యవహారం గురించి నేను పోలీసులకు చెప్పలేదు. నన్ను వదిలేయండి. కొట్టకండి' అంటూ వేడికున్నా ఆ గంజాయి బ్యాచ్ వినలేదు. మద్యం, గంజాయి మత్తులో ముళ్ల కర్రలు తీసుకుని చితకబాదారు. గాయాలు అయ్యేలా గంటల పాటు హింసకు గురి చేశారు. దగ్గర ఉన్న డబ్బూ లాక్కుని, మరికొంత కావాలంటూ బెదించారు. ఆపై కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఎలాగోలా స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో అతను కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ దారుణ ఉదంతం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది.

ప్రొద్దుటూరులోని అమృతనగర్​కు చెందిన షేక్ ఆరీఫ్ గ్యాస్ స్టవ్ రిపేర్ పనులు చేస్తుంటాడు. నెల రోజుల క్రితం ఎర్రగుంట్ల మండలంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు ప్రొద్దుటూరు వచ్చి స్నేహితులను కలిసి వెళ్లేవాడు. ఈ క్రమంలో పట్టణానికి వచ్చిన ఆరీఫ్​కు హౌసింగ్ బోర్డు కాలనీకి చెంది ఓ యువకుడు ఫోన్ చేయడంతో అతనితో కలిసి ఆటోనగర్ సమీపంలోని ఓ ప్రదేశానికి ఆదివారం వెళ్లాడు. అప్పటికే అక్కడ మరికొంతమంది యువకులు ఉన్నారు. కాసేపటికి శ్రీనివాసనగర్, సంజీవనగర్​కు చెందిన ఇద్దరు యువకులు ఆరీఫ్​పై దాడి చేయడం ప్రారంభించారు.

ఇటీవల చాపాడు మండలంలో గంజాయి పట్టుకున్న పోలీసులు, కొంతమంది యువకులను అరెస్టు చేసి చాపాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆరీఫ్​పై దాడి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. గంజాయి గురించి ఆరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని అనుమానం పెంచుకున్న ఆ బ్యాచ్, పథకం ప్రకారం పిలిపించి దాడి చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వారి గురించి ఎవరీకీ చెప్పలేదని అతను వేడుకున్నా ఏ మాత్రం వినలేదు. గంజాయి, మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఆరిఫ్​ను కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అతని వీపు, చెయ్యి ఇతర భాగాల్లో గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకూ హింసకు గురి చేశారు.

దాడి చేసిన అనంతరం ఆరీఫ్​ను మరో ఇద్దరు యువకులు బైక్​పై ఎక్కించుకుని విజయవాడకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కిడ్నాప్​ చేసేందుకు యత్నించారు. మైదుకూరు దాటిన తరువాత ఓ శుభకార్యం జరుగుతుండటంతో అక్కడ మత్తులో చిందులేస్తూ కొద్దిసేపు గడిపారు. ఈ క్రమంలో ఫోన్ చేసి డబ్బులు తెప్పిస్తానని ఫోన్ తీసుకున్న ఆరీఫ్, ప్రొద్దుటూరులోని అతని స్నేహితుడు చిన్నాకు సోమవారం తెల్లవారుజాము సమయంలో ఫోన్ చేశారు. లోకేషన్ పంపి తాను ప్రమాదంలో ఉన్నానని, తిరిగి కాల్, మెసేజ్ చేయకుండా త్వరగా రావాలని కంగారుగా వాట్సప్​లో వాయిస్ మెసేజ్ పంపాడు.

స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే డయల్ 100కి కాల్ చేసిన చిన్నా, ఆ వెంటనే లోకేషన్ ప్రదేశానికి చేరుకున్నాడు. బైక్​లో ప్రొద్దుటూరుకు తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వారి చెర నుంచి కాపాడారు. తనను చంపాలన్న ఉద్దేశం దాడి చేసిన వ్యక్తుల్లో కనిపించిందని బాధితుడు ఆరోపించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారించారు. తనపై దాడి చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆరిఫ్ డిమాండ్ కోరాడు.

"ఆదివారం రోజు ఫ్రెండ్స్​ని కలుద్దామని ప్రొద్దుటూరి వెళ్లాను. నరేష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. నేను, నరేష్, జాకీర్ అనే మరో అబ్బాయితో వెళ్లాము. వాళ్లు అక్కడ కుమ్మక్కై, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకూ కొట్టారు. రెండు నెలల క్రితం గంజాయి కేసులో పోలీసులు వారిని పట్టుకున్నారు. నాపైన అనుమానంతో కంప చెట్లతో కొట్టారు. నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు. నా దగ్గర 4000 డబ్బులు కూడా తీసుకున్నారు". - ఆరిఫ్‌, బాధితుడు

గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు - మళ్లీ నేరం చేస్తే మరణశిక్ష!: ఈగల్ విభాగాధిపతి రవికృష్ణ

అత్యంత కఠినంగా ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ - గంజాయి కేసుల్లో చిక్కితే 20 ఏళ్లు కటకటాలే!

ABOUT THE AUTHOR

...view details