Robbery Incidents in Hyderabad : దొంగలకు పాత చెప్పైనా బంగారమే. అర్ధరాత్రి అయిందంటే చాలు, నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చడిచప్పుడు కాకుండా ఇళ్లలోని నగదు, బంగారాన్ని చోరీ(Robbery Incidents) చేస్తున్నారు. బడి, గుడి, ప్రభుత్వ సంస్థలు, ఇళ్లు ఇలా ఏదైనా సరే, అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఎల్లమ్మ బండ జన్మభూమిలో నివాసముంటున్న మక్సూద్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉప్పల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు.
Frequent Theft Incidents in Hyderabad : బుధవారం రాత్రి తిరిగి వచ్చేసరికి తాళం బద్దలై ఉండడం గమనించి కంగుతిన్నాడు. ఇంట్లోకెళ్లి చూస్తే రూ. 4 లక్షల నగదు, 18 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరొకటి గమనిస్తే తిరుపతి లాంటి ప్రదేశంలో దొంగతనాలకు అలవాటు పడిన చిత్తూరు జిల్లాకు చెందిన సంజయ్, కేపీహెచ్బీ పరిధిలో గత అయిదు నెలలుగా దొంగతనాలు చేస్తున్నాడు. అడ్డగుట్టలోని ఓ హాస్టలే తన అడ్డాగా నివాసముంటూ చోరీలకు పాల్పడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి నుంచి 12 లక్షలు విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చోరీకి గురైంది. ఇటీవల రికార్డ్ రూమ్కి చెందిన నాలుగు గ్రిల్స్, రెండు తలుపుల తాళాలు తొలగించి దుండగులు లోనికి ప్రవేశించారు. ఉదయమే కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన కార్మికులు, దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాఠశాల్లలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు.
ఐదు రోజుల క్రితం మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్(Cheddi Gang) సంచలనం సృష్టించింది. వరల్డ్ వన్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వచ్చి కౌంటర్లో ఉన్న రూ. 7లక్షల 85వేల నగదు దొంగలించారని పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటిమీద బట్టలు లేకుండా వచ్చిన చెడ్డీ గ్యాంగ్ను చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ప్రతీచోట దొంగలు చోరీలు చేస్తున్నారు.