తెలంగాణ

telangana

ETV Bharat / state

'మన్యం'లోనూ వయనాడ్‌ తరహా విలయం - విరుచుకుపడుతున్న కొండచరియలు - Flash Floods Effect In AP - FLASH FLOODS EFFECT IN AP

Flash Floods Effect AP : ఏపీలోని అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలు కేరళలోని వయనాడ్​ తరహా విలయాన్ని గుర్తు చేసేవిధంగా ఉన్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Flash Floods Effect AP
Flash Floods Effect AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 10:01 AM IST

Flash Floods Effect In AP : ఎడతెరపి లేని అత్యంత భారీ వర్షం, ఉరుములు, మెరుపుల ధాటికి ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతమైన మాదిగముల్లులోని ఓ కుటుంబం నిద్రలోంచి మేల్కొంది. ఇంట్లోకి వరద నీరు చేరడంతో దగ్గర్లోని మరో ఇంటికెళ్లి మొదటి అంతస్తు ఎక్కారు. అంత ఎత్తులోనూ పీకల్లోతు నీటిలో మునుగుతూ ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లారాక దిగొస్తే, అక్కడ తమ ఇంటి ఆనవాళ్లే కన్పించలేదు. చుట్టూ బురదతో, చెట్లు మేట వేశాయి.

కొండచరియలు విరిగిపడి: అల్లూరి జిల్లాలోనే కమ్మరితోటలో అత్యంత భారీ వర్షం, పెద్ద పెద్ద శబ్దాలతో గ్రామస్థులు రాత్రంతా భయం భయంగా జీవించారు. తెల్లారాక చూస్తే కొండచరియలు విరిగిపడి, కొట్టుకువచ్చిన మట్టి ఊరిని చుట్టేసింది. పొలాలు నిండా రాళ్లతో మేట వేశాయి. మరికొంతసేపు వాన కురిస్తే ఊరే తుడిచిపెట్టుకుపోయేదేమో అనే పరిస్థితి నెలకొంది. అక్కడే కాదు సీలేరు, ధారకొండ, దుప్పలవాడ, గుమ్మిరేవుల, గాలికొండ, అమ్మవారి ధారకొండ ప్రాంతాల్లోనూ ఇదే విధంగా వరద విలయం ముంచెత్తింది. వంతెనలు కొట్టుకుపోయాయి. సీలేరు ప్రాంతానికి ఇప్పటికీ బస్సులు రావడం లేదు.

ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షానికి విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. విశాఖపట్నంలోనూ భారీ వర్షాలకు కొండ ప్రాంతంలోని ఇళ్ల కింద మట్టి కొట్టుకుపోవడంతో ఏ క్షణమైనా కూలిపోయేవిధంగా ఉన్నాయి.

కేరళ వయనాడ్​ విళయాన్ని తలపించే రీతిలో :ఇటీవల ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతంలో వచ్చిన వరదలు కేరళలోని వయనాడ్‌ విలయాన్ని తలపించేలా ఉన్నాయి. ఆ వరదల దెబ్బ నుంచి మన్యం ఇంకా కోలుకోలేదు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ఊహించని విధంగా విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అనే రీతిలో అత్యంత భారీ వర్షాలు (24 గంటల్లో 20.4 సెం.మీ. మించి) దంచి కొడుతున్నాయి. ఆగస్టు చివరిలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 53 సెం.మీ వర్షం కురవడం భవిష్యత్తులో వచ్చే విలయం మరెంత భయానకంగా ఉంటుందో హెచ్చరిస్తోంది.

ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా? :రికార్డులు తిరగరాస్తున్న వరద ప్రవాహాల ధాటికి ప్రాజెక్టు నిర్మాణాలనే మళ్లీ సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ముంచెత్తుతున్న వరదలకు ఇళ్లు, పొలాలు, వాగులు వంకలు ఏకమై రోజులతరబడి బురద, ముంపులో మునుగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో ఎవర్ని కదిలించినా ఒకటే గాథ. ఇంతటి వరదను 40, 50 ఏళ్లలో ఎన్నడూ చూడలేదనే మాటలే. వయనాడ్‌ తరహా విలయం విరుచుకుపడినా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన అత్యంత భారీ వర్షాలను తలదన్నేలా కుంభవృష్టి ముంచెత్తినా జలదిగ్భందంమే.

ఈ ఏడాది భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశాల్లోనే కేంద్ర విపత్తుల శాఖ ముందే హెచ్చరించింది. అప్పుడే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమై ముందస్తు ప్రణాళికలు రూపొందించి ఉంటే విజయవాడ తరహా విపత్తు ఎదురయ్యేది కాదు. అయినా ఆ విపత్తు శాఖ ఇప్పటికీ కళ్లు తెరవలేదు. అటవీ ప్రాంతాల్లో పెరుగుతున్న విపత్తులు, కొండ ప్రాంతాలకు సమీపంలోని ఇళ్లకు పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై చేష్టలుడిగి చూస్తోంది.

25 సెం.మీ వర్షపాతానికి మించి : 24 గంటల్లో 20 సెం.మీ వర్షం కురిస్తే అమ్మో కుంభవృష్టి అనేవాళ్లం. ఇప్పుడు ఒక్క రోజులో 25 సెం.మీ. వర్షం అనేది సర్వ సాధారణంగా తయారైంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలాచోట్ల అతి, అత్యంత భారీ వర్షాలు నమోదవుతుండటం గమనార్హం. గంట వ్యవధిలో 6 నుంచి 10 సెం.మీ. వర్షం కురుస్తున్న సందర్భాలు ఉన్నాయి. అది ఒకటి, రెండు ప్రాంతాలకే పరిమితమైతే వరద ప్రవాహం తక్కువగానే ఉంటుంది. కానీ వందల కిలోమీటర్ల విస్తృతిలో అత్యంత భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తి ఊరూవాడా తేడా లేకుండా ముంచెత్తుతున్నాయి.

తెలంగాణలోనూ విరుచుకు పడుతున్న వరదలు : తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 100 కిలోమీటర్లకు పైగా విస్తృతిలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఏకంగా 30 ప్రాంతాల్లో 25 సెం.మీ నుంచి 53 సెం.మీ వర్షం కురిసింది. అదే సమయంలో పొరుగునున్న ఎన్టీఆర్‌ జిల్లాలోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగానే మునేరు, బుడమేరుకు వరద ఉద్ధృతి పెరిగింది.

మిగ్‌జాం తుపాను సమయంలో గతేడాది డిసెంబరు 2 నుంచి 5వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు అంటే మూడు రోజుల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. పెళ్లకూరు, నాయుడుపేట, బుచ్చినాయుడుకండ్రిగ, చిల్లకూరు, నెల్లూరు అర్బన్, కోట తదితర 12 మండలాల్లో 50 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ అప్పట్లో 24 గంటల్లోనే 25 సెం.మీ పైగా వర్షం దంచికొట్టింది. తుపాన్లు, ద్రోణుల ప్రభావంతో అత్యంత భారీవర్షాలు కురిసే ప్రాంతాలే ఎక్కువగా ఉంటున్నాయి.

సంసిద్ధతా ప్రణాళికలు రూపొందించాలి :విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ఏపీలోని మన్యంలో అత్యంత భారీ వర్షాలతో ప్రజల జీవనమే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ రాత్రి ఎటు నుంచి మట్టి, రాళ్లు, చెట్లతో కూడిన వరద ముంచెత్తుతుందో అనే భయాందోళనల మధ్య జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎంత వర్షం కురుస్తుందో గుర్తించే పరిస్థితి కూడా లేదు.

తెలుసుకునేలోగానే వరదలు ముంచెత్తుతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో కొండలపై ఇళ్లు కట్టుకున్న వారికీ వాన కురుస్తుందంటే గుండె దడే! రాష్ట్ర ప్రభుత్వం నదీ పరీవాహకప్రాంతాలతో పాటు మైదాన, కొండ ప్రాంతాల్లోనూ వర్షపాతాన్ని గుర్తించి తక్షణమే అప్రమత్తం చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. విపత్తు సమయాల్లో వారికి తక్షణ సహాయం అందించేవిధంగా చూడాలి.

గత వైఎస్సార్​సీపీ హయంలో ఎంత ఖర్చుచేశారో? : పెరుగుతున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్రం రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద నిధుల్ని కేటాయిస్తుంది. ఇందులో కేంద్రం 75%, రాష్ట్రం 25% భరిస్తాయి. 2021-22 నుంచి 2025-26 వరకు ఆంధ్రప్రదేశ్‌కు 6,591 కోట్లు రూపాయలు కేటాయించారు. 2021-22 నుంచి 2023-24 వరకు రూ.3,761 కోట్ల నిధులు అందాయి. వివిధ రకాల విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ఈ నిధుల్ని ఉపయోగించవచ్చు. కానీ గత ప్రభుత్వంలో దేనికి ఖర్చు చేశారో లెక్కలూ చెప్పలేని పరిస్థితి.

తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తిన వరదలు కష్టాలు - కేంద్రంపైనే భారం - Prathidhwani on Flood Victims

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

ABOUT THE AUTHOR

...view details