ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 9:22 AM IST

ETV Bharat / state

ఏసీబీలోనూ అవినీతి అనకొండలు- ఐదుగురిపై వేటు

Five Policemen Suspended: కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కారు. కీలకమైన ఏసీబీలో ఉంటూ అవినీతి సొమ్ము కోసం అక్రమార్కులతో అంటకాగారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు, అక్రమాలు నిజమని తేల్చడంతో అవినీతి ఖాకీలను సస్పెండ్‌ చేశారు.

Five_Policemen_Suspended
Five_Policemen_Suspended

Five Policemen Suspended: అక్రమార్కుల అంతు చూడాల్సిన ఆ అధికారులే అడ్డదార్లు తొక్కారు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఉన్నతాధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. అవినీతి చిట్టా బయటపడిన ఆ అధికారులను సస్పెండ్ చేస్తూ ఇటీవల డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ అనిశా (Anti Corruption Bureau) రేంజిలో డీఎస్పీలు శరత్, శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు కృపానందం, శివకుమార్, కానిస్టేబుల్‌ సురేష్‌ చాలా కాలం పనిచేశారు. నాలుగేళ్లుగా అనిశాలోనే విధులు నిర్వర్తించినట్లు విచారణలో వెలుగుచూసింది. ఈ ఐదుగురు కూటమిగా ఏర్పడి వసూళ్లకు పాల్పడేవారు.

ఉద్యోగానికి ద్రోహం చేస్తూ: బాధితుల నుంచి అవినీతికి సంబంధించి వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా వీరు తొక్కిపెట్టే వారు. దీంతో పాటు ఉద్యోగానికి ద్రోహం చేస్తూ ఆ సమాచారాన్ని అక్రమార్కులతో పంచుకునే వారు. పైగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా పక్కన పడేసేవారు. తనిఖీలు, ట్రాప్, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాలకు వెళ్లే సమయంలో అక్రమార్కులకు ముందుగానే సమాచారం అందించేవారు.

సమాచారాన్ని అవినీతి అధికారులకు లీక్‌ చేస్తూ: పలు సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులపై నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకునేవారు. వీరి వ్యవహార శైలితో విసుగెత్తిన ఫిర్యాదుదారులు ఏసీబీలోని సీఐయూకు (Central Investigation Unit) సమాచారం ఇచ్చేవారు. వీరిని పక్కనపెట్టి సీఐయూ దాడులకు వచ్చిన సందర్భాలలోనూ సమాచారాన్ని అవినీతి అధికారులకు లీక్‌ చేసేవారు.

నేరస్థుడి నుంచి లక్షల్లో డబ్బు వసూలు - ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు

మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని మరీ దందా: గత ఏడాది నవంబరులో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ బాలనాగ ధర్మసింగ్‌ అవినీతికి సంబంధించి ఈ అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. సీఐయూ అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌ ఆస్తులపై పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సమాచారం ముందుగా సబ్‌రిజిస్ట్రార్‌కు అందడంతో నిందితులు పరారయ్యారు. వసూళ్ల కోసం ఈ ఐదుగురు ప్రత్యేకంగా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని మరీ దందా సాగించారు.

లొసుగులను అడ్డం పెట్టుకుని భారీగా మామూళ్లు వసూళ్లు: ప్రభుత్వ శాఖల్లో రాబడి వచ్చే వాటిని వీరు లక్ష్యంగా చేసుకుని తమ ఆదాయ వనరులను పెంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా ఎక్కువ లావాదేవీలు జరిగే రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలపై వీరు గురిపెట్టారు. ఇందులో భాగంగా సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేసేవారు. అక్కడ లొసుగులను అడ్డం పెట్టుకుని భారీగా మామూళ్లు వసూళ్లు చేసేవారని తేలింది.

ఏసీబీలోనూ అవినీతి అనకొండలు- ఐదుగురిపై వేటు

ఆధారాలతో సహా బయటపడటంతో: ఇతర శాఖల్లోనూ ఇదే విధంగా తనిఖీల పేరుతో హడావుడి చేసి, అ తరువాత డబ్బులు ముట్టగానే మిన్నకుండిపోయే వారు. సీఐయూ అధికారులు, సిబ్బంది సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీ చేసే సందర్భాల్లోనూ సస్పెన్షన్‌కు గురైన వీరి నుంచే ముందుగా సమాచారం వెళ్లినట్లు గుర్తించారు. ఇలా వివిధ మార్గాల్లో ఇబ్బడిముబ్బడిగా అక్రమంగా సంపాదించినట్లు ఆధారాలతో సహా బయటపడటంతో వేటు వేశారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు

ABOUT THE AUTHOR

...view details