తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇది విన్నారా? - 'అక్కడ రూ.10 వేలకే ఎకరం భూమికి పోడుపట్టా!'

నకిలీ అటవీ హక్కు పత్రాలతో సొమ్ము చేసుకుంటున్న ముఠా - నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

Fake Podu Pass Books Issue
Fake Podu Pass Books Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Fake Podu Pass Books Issue Warangal : మీకు తెలుసా? పది వేల రూపాయలు ముట్టజెప్పితే ఎకరం భూమి హక్కు పత్రం ఇస్తారు. మరో రూ.10 వేలు ఇస్తే బ్యాంకులో పంట లోన్​ ఇప్పిస్తారు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజమండి. అసలెక్కడ ఈ దందా జరుగుతోంది? దీనివెనకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

ఇది జరిగింది ఎక్కడో కాదండోయ్​! వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో. ఇక్కడ దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల(పట్టా పుస్తకాల) పేరుతో నడిపిస్తున్న నయా దందా ఇది. అటవీ, మారుమూల గ్రామాల రైతులకు మాయమాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి నకిలీ పోడు పట్టాదారు పుస్తకాలను అంటగట్టి రెండు చేతులా దండుకుంటున్నారు. ఈ ఫేక్​ పుస్తకాలు చెలామణి బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే : గతేడాది పోడు భూములు సాగు చేసిన గిరిజన తెగకు చెందిన కోయ, లంబాడ, నాయకపోడు, ఎరుకల సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం సర్వే చేసి పట్టాదారు పుస్తకం( అటవీ హక్కు పత్రాలు) జారీ చేసింది. దీన్నే అవకాశంగా తీసుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ అటవీ హక్కు పత్రాల తయారీకి శ్రీకారం చుట్టాడు ఓ దళారి. సదరు దళారీ గ్రామాల్లోకి వెళ్లి తనకు రూ.10 వేలు ఇస్తే ఎకరం భూమి పోడు పట్టాదారు పాస్​బుక్​ ఇస్తానని నమ్మబలికాడు.

ముందుగా ఒకరిద్దరికి ఇవ్వడంతో నమ్మి చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు 3, 4 ఎకరాలకు నగదు ముట్టజెప్పి పుస్తకాలు పొందారు. ఓ అటవీ గ్రామంలో గిరిజనేతరులైన రైతులకు కూడా నకిలీ పోడు పట్టాలు ఇవ్వడం కొసమెరుపు. నల్లబెల్లి మండలంలో ఐదు గ్రామాలు, నర్సంపేట మండలంలో 3 గ్రామాల్లో ఈ నకిలీ​ పోడు పట్టా పుస్తకాలు జోరుగా చెలామణి అయ్యాయి. గత యాసంగి సీజన్‌లో నర్సంపేటలోని ఓ బ్యాంకు నుంచి వారు పంట లోన్లు కూడా పొందడం విశేషం.

బ్యాంకర్ల తీరుపైనా పలు అనుమానాలు :సాధారణంగా రైతులు పంట లోన్​ కోసం బ్యాంకుకు వస్తే పట్టాదారు పాసు పుస్తకం, 1బీ డాక్యుమెంట్, ఏ బ్యాంకులో రుణం లేనట్టు (నో డ్యూ) ధ్రువపత్రాన్ని తెప్పించుకుంటారు. సదరు రైతు సమర్పించిన డాక్యుమెంట్లు వాస్తవమా కాదా అని ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులో నిర్ధారించుకుంటారు. అనంతరం నానా కొర్రీలు పెట్టి అరకొరగా లోన్​ మంజూరు చేస్తారు.

ఈ నకిలీ పోడు పట్టా పుస్తకాలకు అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా, నో డ్యూ ధ్రువపత్రం లేకుండానే బ్యాంకు అధికారులు లోన్​ ఇవ్వడమనేది గమనార్హం. దీంతో బ్యాంకర్ల తీరుపైనా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. నకిలీ పోడు పట్టా పాస్​ పుస్తకాల గుట్టు రట్టు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయమై నర్సంపేట అటవీక్షేత్ర అధికారి రవికుమార్‌ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

'ధరణి'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పోర్టల్​ నిర్వహణ ఎన్​ఐసీకి అప్పగింత

నూతన ఆర్వోఆర్ చట్టం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి?

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details