Election Commission On AP Welfare Schemes : వైఎస్సార్సీపీ సర్కార్ కుట్రలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకుని అడ్డుకుంది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సొమ్మును కావాలనే నిలుపుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అవి పాత పథకాలేనని, వాటి చెల్లింపులు చేపడతామంటూ స్క్రీనింగ్ కమిటీలో ఆమోదింపజేసుకుని ఈసీ ఆమోదానికి ప్రయత్నించారు. సీఎం జగన్కు నమ్మినబంటులా ఉన్న సీఎస్ జవహర్రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ స్వామిభక్తి ప్రదర్శిస్తూ, పావులు కదుపుతూ వచ్చారు. గురువారం రాత్రి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5 గంటలకే కార్పొరేషన్లలో అధికారులందరినీ రప్పించారు.
Central Election Commission Letter To AP GOVT :బిల్లుల చెల్లింపులకూ ఏర్పాట్లు చేసేశారు. ఇంతలో ఈసీ నుంచి సీఎస్కు ఫోన్ వచ్చింది. ముందుకు వెళ్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఈసీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం సీఎస్కు ఓ లేఖ వచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి, చెల్లింపుల వివరాలతో పాటు మరిన్ని కఠినమైన ప్రశ్నలు సంధించారు. దీంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరకు శుక్రవారం రాత్రి ఈసీ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పోలింగు పూర్తయ్యేవరకు పథకాల సొమ్ములు చెల్లించాల్సిన అత్యవసరం ఏమీ లేదంది. అప్పటివరకు చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎప్పుడైనా చెల్లించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
చూశారా.. ఇదీ జగన్ మార్క్ మోసం! - Jagan cheating in Funds Release
జనవరి 23న ఆసరా కింద ఇవ్వాల్సిన 6 వేల 394 కోట్ల రూపాయాలు, ఫిబ్రవరి 28న లబ్ధిదారులకు జమకావాల్సిన వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా నిధులు 78 కోట్ల 53 లక్షల రూపాయలు, జగనన్న విద్యాదీవెన కింద మార్చి 1న ఇవ్వాల్సిన 708 కోట్ల 68 లక్షలు, మార్చి 6న ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ 12 వందల 94 కోట్ల రూపాయలు, మార్చి 7న జమచేయాల్సిన వైఎస్సార్ చేయూత 560 కోట్ల 49 లక్షలు, మార్చి 14న ఇవ్వాల్సిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం 629 కోట్ల 37 లక్షల రూపాయలు ఏకమొత్తంగా ఇప్పుడు చెల్లించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్నారు. అందుకే నాడు నిధులున్నా చెల్లించలేదనే విషయం ఈసీ ప్రశ్నలు, అధికారుల సమాధానాలతో స్పష్టంగా బయటకొచ్చింది.
ఇన్నాళ్లూ ఆపి, ఇప్పుడు పంపిణీ చేయాలని చూస్తున్న విషయాన్ని వివిధ వర్గాల ద్వారా ఈసీ తెలుసుకుంది. పోలింగ్ తర్వాతే చెల్లింపులు చేపట్టాలని, అంతవరకు నిలిపివేయాలని తొలుత మే 9న సీఎస్కు లేఖ రాసింది. ఆయన నుంచి కొన్ని వివరాలు కోరింది. చాన్నాళ్ల ముందే ఈ స్కీంల కోసం బటన్ నొక్కినా వెంటనే ఎందుకు ఖాతాల్లో జమచేయలేదో చెప్పాలని అడిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా దీనిపై నివేదిక పంపించాలని కోరింది. ఈ నేపథ్యంలో జగన్ బృందంలో స్లీపర్సెల్స్లా పనిచేసే ప్రతినిధులు వేగంగా కదిలారు. అప్పటికే ఈ విషయం హైకోర్టులో విచారణలో ఉంది. గురువారం హైకోర్టు సింగిల్జడ్జి ముందు విచారణకు వచ్చింది. ఈసీ ఆదేశాలను ఒకరోజు నిలుపుదల చేస్తూ రాత్రిపూట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు చెల్లింపులు జరపరాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి నుంచే ఈ చెల్లింపులకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలన్నీ వివిధ కార్పొరేషన్ల కింద అమలవుతున్నాయి. ఆయా కార్పొరేషన్ల ఎండీలు, ఇతర సిబ్బందిని శుక్రవారం ఉదయమే వారి కార్యాలయాలకు పిలిపించారు. ఇంతలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు అధికారులందరికీ అందడంతో, వాటిని చదివి కొంత సందేహంలో పడ్డారు.