Dharani Portal Latest News Telangana 2024 :ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 9వ తేదీలోగా పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల (Dharani Portal Problems) పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ సూచనలకు అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నిస్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని వాటి వివరాలు కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. అర్జీలు తిరస్కరిస్తే అందుకు కారణాలను భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
Special Drive on Dharani Pending Applications :ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వారు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేసి ఆ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డీఆర్డీఓ, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను ఆ బృందాల్లో నియమించనున్నారు.
ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ : కోదండ రెడ్డి
Dharani Portal Problems 2024 : గ్రామాలు, మాడ్యూళ్ల వారీగా అర్జీలను ఆ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకి గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సప్, సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం చేరవేస్తాయి. అర్జీదారుల వద్ద ఉన్నఆధారాలు సహా రెవెన్యూ మూల దస్త్రాలు అవసరమైతే భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ప్రతి అర్జీపై విచారణ చేసి పరిష్కారం లేదా తిరస్కరణల్లో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నవీన్ మిత్తల్ తెలిపారు. కలెక్టర్ల వద్ద ఒక్క అర్జీ మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.
తహసీల్దార్ల స్థాయిలో : నాలుగు రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా పహాణీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలు పరిష్కరిస్తారని సర్కార్ తెలిపింది. అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, జీపీఏ, ఎస్పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ అర్జీలు సహా భూసమస్యలకు సంబంధించిన వినతులను తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తారు. రెండు, మూడు ఖాతాలు నమోదై ఉంటే కలపడం వంటివి చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు
ఆర్డీఓ స్థాయిలో : ఆరు రకాల మాడ్యూళ్లలో వచ్చిన అర్జీలను ఆర్డీఓ స్థాయిలో పరిష్కరిస్తారని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. పాసుపుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, భూసేకరణకు చెందిన సమస్యలు, ప్రవాసీయులకు చెందిన భూసమస్యలు, సంస్థల పేరిట పాసుపుస్తకాలు, కోర్టు కేసులు, పాసుపుస్తకాల్లో తప్పులు నమోదై ఉంటే ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించనున్నారు. మూల విలువ రూ.5 లక్షల లోపు ఉన్న భూములకు చెందిన గల్లంతైన సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారని తెలంగాణ సర్కార్ వివరించింది.