తెలంగాణ

telangana

ETV Bharat / state

"హైదరాబాద్‌ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్‌ - వాటిని మాయం చేస్తే ఎలా?"

హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు నిర్మాణాలు కూల్చక తప్పదు. ప్రజలకు మేలు జరగకూడదనేదే ప్రతిపక్షాల అజెండా - టెండర్లే పిలవకుంటే రూ.1.50 లక్షల కోట్లు అవుతుందని ఎలా చెబుతారు? విపక్షాలపై భట్టి ఫైర్

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

Deputy CM Bhatti Vikramarka Comments On BRS
Deputy CM Bhatti Vikramarka On Musi Development (ETV Bharat)

Deputy CM Bhatti Vikramarka On Musi Development :అందరి ఆమోదయోగ్యంతోనే చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2014-23 కాలంలోనూ జలవనరులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని సరిచేసే పనిని చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌పై రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు బురదచల్లడం సరికాదని సూచించారు. నిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న భట్టి, విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు.

హైడ్రా పనితీరు, చెరువులు పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనపై విపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పూర్తి వివరాలు అందజేశారు. 2014 నుంచి 2023వరకు హైదరాబాద్‌లో చెరువులు ఎలా కబ్జాకు గురయ్యానే వివరాలను అధికారులు తెలిపారు. అనేక చెరువులు పూర్తిగా కబ్జాకు గురికాగా, మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలు గురయ్యాయని తెలిపారు. ఇవన్నీ హైదరాబాద్‌ ప్రజలు ఆస్తి అని, వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Hyderabad Map View Between 2014-2023 (eenadu.net)

ఇది ప్రజా ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వమన్న భట్టి, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చెరువులు ప్రజల ఆస్తి అని, హైదరాబాద్‌ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్‌ అని వ్యాఖ్యానించారు. ఇవి భాగ్యనగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయని తెలిపారు. నగరంలో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయన్న ఆయన, మూసీని ఆధునికీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయి అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రాను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కోసమో, మంత్రుల కోసమో కాదని, చెరువులు అన్యాక్రాంతం కాకుండా కొత్త నిబంధనలు తెచ్చుకున్నామని అన్నారు. చెరువులను భవిష్యత్‌ తరాలకు అందించాలని ఉపముఖ్యమంత్రి భట్టి వివరించారు.

"హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు నిర్మాణాలు కూల్చక తప్పదు. మూసీని బాగు చేస్తే హైదరాబాద్‌కు మరింత పేరొస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలనే కూల్చుతున్నాం. బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు కూల్చవద్దని ఆదేశించాం"- భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

కూలగొట్టిన ఇళ్ల కంటే మెరుగైనవి ఇస్తున్నాం..

ఇప్పటికైనా చెరువుల ఆక్రమణ ఆపాలన్న డిప్యూటీ సీఎం, మూసీలో మంచినీళ్లు లేకుండా డ్రైనేజీగా మార్చేశామని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఇతర దేశాల్లోనూ నదులు డ్రైనేజీల్లా ఉండేవని, వాళ్లు కాలనుగుణంగా మార్చుకున్నారని దీంతో నదులను ఆస్తులుగా మార్చుకున్నాయని వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయన్న ఆయన, టెండర్లే పిలవకుండా రూ.లక్షన్నర కోట్లు అవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

మూసీ సుందరీకరణ అంశంపై ప్రతిపక్షాలు తమ ఆలోచనలు తమకు తెలియజేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలిగించమన్న భట్టి, ఇళ్లను తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. కూలగొట్టిన ఇళ్ల కంటే మెరుగైన ఇళ్లను కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు జరగకూడదనేదే ప్రతిపక్షాల అజెండా అని ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని, పరిపాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భట్టి అన్నారు.

మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయంపై సూచనలు ఇవ్వండి - ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు - CM REVANTH ON MUSI DEVELOPMENT

జీహెచ్​ఎంసీలో 4 మేయర్ స్థానాలను పరిశీలిస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy On GHMC Divide

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details