Women Gang Cyanide Murders at Guntur in AP :ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో ఈ ఏడాది జూన్ 5వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి పంపించారు. మహిళ ఎవరని విచారించగా, తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్ బీగా గుర్తించారు. మృతదేహంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో హత్య జరిగిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
తెనాలి, చేబ్రోలు మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించగా, జూన్ 2వ తేదీన మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. ఆ మహిళల్ని పట్టుకుని విచారించగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. డబ్బు కోసం నాగూర్ బీని బ్రీజర్లో సైనైడ్ కలిపి తాగించి చంపినట్లు అంగీకరించారు. ఆటోలో వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చి నాగూర్ బీని చంపి ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకెళ్లారు. వీరిలో ఒకరు మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి కాగా, మరొకరు ఆమె తల్లి రమణమ్మగా గుర్తించారు.
తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు హత్యలు : గతంలో కూడా ఇలాంటి హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022లో వెంకటేశ్వరి అత్త సుబ్బలక్ష్మిని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమె నివాసంలో ఎవరికీ అనుమానం రాకుండా మద్యంలో సైనైడ్ కలిపి చంపారు. 2023 ఆగస్టులో తెనాలికి చెందిన నాగమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలికి శీతల పానీయంలో సైనైడ్ కలిపి ఇచ్చారు. ఆమె వయోభారంతో చనిపోయారని అందరూ భావించారు. 2024 ఏప్రిల్లో మోషే అనే వ్యక్తిని ఇదే తరహాలో చంపారు. మోషే మద్యం తాగి వచ్చి తన భార్యతో గొడవలు పడుతుండేవాడు.
అతనిని చంపితే ఇన్సూరెన్స్, పింఛన్లో వాటా వస్తుందనే మోషే భార్య భూదేవితో కలిసి మద్యంలో సైనైడ్ కలిపి చంపారు. మొదటి మూడు హత్యలు ఇళ్లలోనే జరిగాయి. అనారోగ్యం, వయోభారం వల్ల చనిపోయారని అంతా భావించారు. ఎవరికీ అనుమానం రాలేదు. కానీ నాగూర్ బీ హత్య బయటి ప్రాంతంలో జరగటంతో పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసుల విచారణలో వెంకటేశ్వరి, రమణమ్మ, భూదేవి నిందితులుగా తేలింది.
నాగూర్ బీని సైనైడ్తో చంపారనే విషయం బయటకు రాగానే పొన్నూరు, చేబ్రోలు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వర రావు, చేబ్రోలు ఎస్ఐ వెంకట కృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ముందుగా వెంకటేశ్వరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె తల్లి రమణమ్మని, భూదేవిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని హత్య చేయగా, వారిలో ముగ్గురు తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందినవారు. హత్యకు పాల్పడిన ముగ్గురు కూడా అదే కాలనీలో నివాసం ఉంటున్నారు.