CAG Report on CFMS to AP :2022-23 ఆర్థిక సంవత్సరం చివరి ఆడిట్ను వెలువరించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ జగన్ ప్రభుత్వాన్ని తలంటింది. నాటి సర్కార్ ఆర్థిక నిర్వహణ తీరుతెన్నుల్లోని లోపాలను బహిర్గతం చేసింది. కేంద్రానికి కొన్ని రుణాల లెక్కలు చెప్పకుండా అపరిమితమైన అప్పులు చేశారని అవి నిర్దేశిత ప్రమాణాలను మించిపోయాయని పేర్కొంది. పెండింగ్ బిల్లులనూ పరిగణనలోకి తీసుకోవాలని అవన్నీ కలిపితే రుణభారం పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది.
రాష్ట్ర విభజన కారణం కాదని ఉద్ఘాటన :రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని ప్రభుత్వ ఖర్చుల్ని కార్పొరేషన్ వ్యయాల్లో చూపినట్లు కాగ్ వెల్లడించింది. చట్టానికి లోబడే ఆర్థిక నిర్వహణ చేస్తున్నట్లు చూపేందుకే ఇలా చేశారని స్పష్టం చేసింది. రాజ్యాంగవిరుద్ధంగా కార్పొరేషన్ల ఏర్పాటు, సంచిత నిధిని వాటికి మళ్లించడం, అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించకపోవడం వంటి అంశాలను ఎండగట్టింది. నాటి ఆర్థిక పరిస్థితులకు రాష్ట్ర విభజన కారణం కాదని అదుపుతప్పిన ప్రభుత్వ ఖర్చులు, విధానాలే కారణమని కాగ్ విశ్లేషించింది.
వైఎస్సార్సీపీ సర్కార్ కొన్ని రుణాలను కలపకుండా మొత్తం అప్పును తేల్చిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. జీఎస్డీపీలో రుణాల వాటా తక్కువగా చూపి ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు ఉన్నాయని చెబుతూ వచ్చిందని వెల్లడించింది. బడ్జెట్లో చూపని రుణాల మొత్తాన్ని తక్కువ చేసి చూపుతూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని పేర్కొంది. ఆ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొత్తం కన్నా చాలా ఎక్కువని కాగ్ స్పష్టంచేసింది.
కార్పొరేషన్ల రుణాలు తమ బాధ్యత కాదని వైఎస్సార్సీపీ సర్కార్ చెప్పడం సరికాదని కాగ్ పేర్కొంది. రెవెన్యూ లోటు 2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 405.2 శాతం పెరిగిందని తేల్చింది. రెవెన్యూ లోటును రూ.3118 కోట్లు, ద్రవ్యలోటును రూ.2405 కోట్ల మేర తక్కువగా చూపిందని తెలిపింది. తలసరి అప్పులనూ లెక్కగట్టిన కాగ్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ.1,03,758లుగా కాగ్ వివరించింది.
రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి : రాబోయే ఏడేళ్లలో రాష్ట్రం రూ.1,39,567.14 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్ వెల్లడించింది. ఈ భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంతో పాటు వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించింది. ఇందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల్లేకుండా పోతాయని పేర్కొంది.
CAG Report Health Sector in AP :2022-23లో 341 రోజులూ జగన్ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు వద్ద రోజువారీ కనీసనిల్వ రూ.1.94 కోట్లను కేవలం 24 రోజులు మాత్రమే నిర్వహించగలిగింది. ఆస్తుల సృష్టికి 2018-19లో రూ.19,976 కోట్లు వెచ్చిస్తే 2022-23లో వైఎస్సార్సీపీ సర్కార్ ఖర్చు పెట్టింది కేవలం రూ.7244 కోట్లు. వైఎస్సార్ గృహవసతి పథకం కింద ఇళ్ల స్థలాలకు చేసిన రూ.100 కోట్ల ఖర్చునూ మూలధన వ్యయంగా చూపారు. అది రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. జాతీయ ఆరోగ్య మిషన్-ఎన్హెచ్ఎం కింద వివిధ కార్యక్రమాల కోసం 2017-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రూ.350.93 కోట్లు విడుదల చేయలేదని కాగ్ ఆక్షేపించింది. నాబార్డు, ప్రపంచబ్యాంకులు అందించిన ఆర్థిక సహాయాన్నీ ఉపయోగించుకోలేదని పేర్కొంది.