ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు - సుప్రీం కొలీజియం సిఫార్సు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 12:17 PM IST

lawyers_as_ap_hc_judges
lawyers_as_ap_hc_judges (ETV Bharat)

Collegium Recommends Appointment of 3 Lawyers as Andhra Pradesh High Court Judges :ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, గుణరంజన్‌, చంద్ర ధనశేఖర్‌ పేర్లను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తోన్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్‌, గుణరంజన్‌ను అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌తో కూడిన కొలీజియం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, హైకోర్టులోని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించి ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే 15న పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలీజియం పేర్కొంది.

'ఓసారి నా స్థానంలో కూర్చోండి - ఎంత ఒత్తిడి ఉంటుందో మీకే తెలుస్తుంది' - న్యాయవాదులపై CJI తీవ్ర అసహనం

కుంచం మహేశ్వరరావు కె.సుశీలమ్మ, కె. కోటేశ్వరరావు దంపతులకు తిరుపతిలో జన్మించారు. తిరుపతిలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. తర్వాత ప్రాక్టీసును హైకోర్టుగా మార్చారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వద్ద కొంత కాలం జూనియర్‌గా ప్రాక్టీసు చేశారు. తర్వాత సొంతగా ప్రాక్టీసు ప్రారంభించారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ సంబంధ కేసుల్లో పట్టు సాధించారు. హైకోర్టు ప్యానల్‌ న్యాయవాదిగా.. భారత బార్‌ కౌన్సిల్‌, ఎఫ్​సీఐ, సహా పలు బీమా సంస్థలకు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

తూట చంద్ర ధనశేఖర్‌ తల్లిదండ్రులు శైలజ, చంద్రశేఖరన్. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. నెల్లూరు వీఆర్​ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1999లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. మాజీ A.G, పి.వేణుగోపాల్‌ వద్ద జూనియర్‌ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ట్యాక్స్‌, రెవెన్యూ, భూసేకరణ, సివిల్‌, క్రిమినల్‌ చట్టాలపై అనుభవం గడించారు.

చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతుల కుమారుడు గుణరంజన్‌. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వాళ్లు. తండ్రి నారాయణ న్యాయవాది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ గుణరంజన్‌కు సోదరుడి వరుస అవుతారు. 2001 మార్చి 21న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రైబ్యునళ్లలో 2 దశాబ్దాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. సివిల్, క్రిమినల్‌ చట్టాలతోపాటు విద్యుత్‌ సంబంధ, పర్యావరణ, ట్యాక్స్, కంపెనీ లా, దివాళా వంటి పలు చట్టాలపై అపార అనుభవం గడించారు. పలు ప్రఖ్యాత సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

జస్టిస్ దుర్గాప్రసాద్ పదవీ విరమణ- హైకోర్టులో ఘనంగా వీడ్కోలు - Justice DurgaRao Retire on Aug 11

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు తాజాగా చేసిన ముగ్గురు పేర్ల సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుతుంది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details