CM Revanth Interacts With Humanoid Robot :హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో మంగళవారం ప్రారంభమైన ‘షీల్డ్-2025’ సైబర్ సెక్యూరిటీ సదస్సులో హ్యుమనాయిడ్ రోబో అతిథుల్ని ఆకట్టుకుంది. మెషీన్ లెర్నింగ్ ఆధారిత పరిజ్ఞానంతో కూడిన ఆ రోబో సీఎం రేవంత్రెడ్డి సహా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులతో సంభాషించింది. రోబో తొలుత సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అనంతరం ఆయనతో మాట్లాడుతూ ‘హలో సీఎం సార్! నా పేరు భారతి. నేను ఒక ఏఐ హ్యుమనాయిడ్ రోబోను’ అని తనని తాను పరిచయం చేసుకుంది. తనను ఏదైనా అడిగితే సమాధానం చెబుతానని చెప్పింది. ‘సైబర్ నేరం జరిగితే ఎక్కడ రిపోర్ట్ చేస్తారు?’ అని రోబోను మంత్రి శ్రీధర్ బాబు అడగగా, ‘కాల్ 1930’ అని సమాధానమిచ్చింది. ఈ మొత్తం సంభాషణ అక్కడున్న అతిథుల్ని ఆకట్టుకుంది.
సైబర్ ఫ్యూజన్ సెంటర్ను ప్రారంభించిన సీఎం :ఈ షీల్డ్-2025 సదస్సులో నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ ఎం.యు.నాయర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఫౌండర్ భువన్ రిభూ, టాన్లా ప్లాట్ఫామ్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్ డా.ఆర్ఎస్ శర్మ కీలకోపన్యాసాలు చేశారు. దర్యాప్తు, ఐటీ, స్వచ్ఛంద సంస్థలతో(ఎన్జీవో)లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థల నుంచి సుమారు 900 మంది ప్రతినిధులు హాజరై బృంద చర్చల్లో పాల్గొన్నారు. సదస్సులో రేవంత్ రెడ్డి ‘సైబర్ ఫ్యూజన్ సెంటర్’, ‘చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్’ను వర్చువల్గా ప్రారంభించారు.