CM Chandrababu Meeting With TDP Leaders :టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి దాదాపు 25 మంది గైర్హాజరవ్వడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా పలువురు సమావేశానికి రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వారం రోజుల ముందే షెడ్యూలు విడుదల చేస్తామని తెలిపారు. నాయకులకు ఎన్ని పనులు ఉన్నా, ఏస్థాయి నాయకులైనా సరే తప్పకుండా సమావేశానికి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కీలక అంశాలపై దిశానిర్దేశం :టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాదాపు 7 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో నేతలకు చంద్రబాబు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారు ఎంతటి వారైనా క్షమించేది లేదని గట్టిగా హెచ్చరించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కొందరు నేతలు ఇంకా మౌనం వీడకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు గట్టిగా తిప్పికొట్టడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వసూలు చేసినా ఎక్కడికక్కడ గుట్టలుగా చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నా ప్రజలకు ఎందుకు వివరించడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఇటీవల చెత్తపై పన్ను రద్దు చేయడం సహా ప్రజలకు మేలు జరిగే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని కానీ అవి ఆశించిన మేర ప్రజలకు చేరలేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.
"ఆ ఆరు పాలసీలే గేమ్ ఛేంజర్" - మద్యంలో వేలు పెడతామంటే కుదరదు : చంద్రబాబు వార్నింగ్
ఎమ్మెల్యేల విన్నపలు : ప్రజాప్రతినిధుల నుంచీ చంద్రబాబు సలహాలు స్వీకరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు వెంటనే నియమించాలని వాటిల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు కోరగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2014-19 హయాంలో చేసిన నీరు-చెట్టు పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఎమ్మెల్యేలు కోరారు. సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లను తమ శాఖకు కేటాయించాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి కోరారు.
పారిశ్రామిక పార్కు అభివృద్ధి : ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిలో ఐదుగురిని కేటాయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సూచించారు. నగరి నియోజకవర్గంలో కోశలనగరం పారిశ్రామిక పార్కు అభివృద్ధి( Development of Industrial Park) చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కోరగా చంద్రబాబు అంగీకరించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లింపు నిలిపేసిందని, వాటిని చెల్లించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు.