మైదుకూరులో పొగ మంచు - ఇబ్బందులు పడ్డ వాహనదారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Fog Weather in Mydukur: మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వలన వైయస్సార్ జిల్లా మైదుకూరు ప్రాంతంలో పొగ మంచు అలుముకుంది. పొలాలు, రహదారి చెట్ల మధ్య పొగ మంచు తెరలు ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. వేకువజాము నుంచి దట్టమైన పొగ మంచు ఆవరించింది. దీంతో వాహనదారులు పగలైనా లైట్లు వేసుకుని మరీ రాకపోకలు సాగించారు. మరికొందరు విశ్రాంతి కోసం రోడ్డు పక్కన వాహనాలు నిలిపి వేశారు.
మంచు ఎక్కువగా కురవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు జనానికి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు తెలిపారు. ఉదయం 8 అయినా భానుడు కనిపించకపోవడంతో స్థానికులు రోడ్డుపైకి రావడానికి విముఖత చూపారు. దట్టమైన పొగమంచుతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. శీతాకాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు దర్శనమిస్తోంది. అయితే జనవరి నెలలో రావాల్సిన పొగ మంచు దట్టంగా ఇప్పటి నుంచే రావడం ఆశ్చర్యాన్ని సంతరించుకుంది.