Sell Gold Biscuits Fraud in AP : ఓ బ్యాంకులో వేలం పాటలో కొన్న బంగారు బిస్కెట్లను విక్రయిస్తున్నానని ఓ మాయలేడి కట్టుకథ అల్లింది. ఇలా అమాయక మహిళల నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టింది. ఆమెకు వైఎస్సార్సీపీ పలువురు నేతలు సహకరించినట్లు సమాచారం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త ఓ బ్యాంకులో పని చేస్తున్నారని పలువురికి తెలిపింది. బ్యాంకులో వేలం పాటలో పాడిన బంగారు బిస్కెట్లను గతంలో కొనుగోలు చేశామని, డబ్బులు అవసరం కావడంతో ఇప్పుడు వాటిని విక్రయిస్తున్నట్లు వారిని నమ్మించింది. కిలో బంగారు బిస్కెట్లు రూ.10 లక్షలకే ఇస్తానని ఆశ చూపింది. ఇది నమ్మిన టెక్కలి, విశాఖపట్నం, నౌపడ తదితర ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి రూ. కోటికి పైగా కాజేసింది.
Srikakulam Women Gold Biscuits Fraud : టెక్కలికి చెందిన పైల దమయంతి నుంచి రూ.37 లక్షలు, నౌపడ గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి నుంచి రూ.35 లక్షలు, బేబీ నుంచి రూ.20 లక్షలు, దాలమ్మ నుంచి రూ.2 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో బంగారు బిస్కెట్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితులు రెండు నెలల కిందట మాయలేడిని నిలదీశారు. తులం బంగారానికి 2 తులాల బంగారం అందజేస్తానని, లేదంటే డబ్బు ఇస్తానని మరోసారి ఆశ చూపింది.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు : మళ్లీ ఇటీవల బాధితులు ఒత్తిడి చేయడంతో పలాస, టెక్కలి, నరసన్నపేట, విశాఖపట్నంలోని బంగారం దుకాణాల్లో బిస్కెట్లు తయారవుతున్నాయని నమ్మించింది. ఇలా నగదు లేదా బంగారం అందకపోవడంతో కొన్ని రోజుల కిందట కొందరు నేతల వద్ద పంచాయితీ జరిగింది. ఈ మోసం బయట పడకుండా గతంలో ఓ కళాశాల ఛైర్మన్గా పని చేసిన వ్యక్తితో పాటు మరికొందరు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వారు రూ.లక్షల్లో వసూలు చేశారు. దస్తావేజులు, ఈ-స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించడంలో వైఎస్సార్సీపీ నాయకులు కీలకంగా వ్యవహరించారు.
దాదాపు 10 రోజుల క్రితం టెక్కలి, నౌపడ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మాయలేడిని పిలిపించగా, బాధితులతో రాజీకి వచ్చి కొన్ని రోజుల గడువు అడిగింది. ఇటీవల ఆ గడువు ముగియడంతో మళ్లీ బాధితులు ఆమెను నిలదీస్తే దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగింది. దీనిపై నౌపడ ఎస్సై నారాయణస్వామిని సంప్రదించగా, బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఆశ పడ్డారో మోసపోతారు.. నకిలీ బంగారు బిస్కెట్లతో టోకరా
బైక్పై కోటి రూపాయల బంగారు బిస్కెట్లు తరలింపు - వాహన తనిఖీల్లో స్వాధీనం