ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 9:12 PM IST

Updated : Jun 22, 2024, 10:15 PM IST

ETV Bharat / state

దేవుడి స్క్రిప్ట్​తోనే వైఎస్సార్​సీపీ 11 సీట్లు- పిరికితనంతో జగన్ పారిపోయాడు: చంద్రబాబు - CM Chandrababu on YSRCP

CM Chandrababu Comments on YSRCP: దేవుడి స్క్రిప్ట్‌ వల్లే వైఎస్సార్​సీపీ 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ధైర్యంగా తాము సభకు వచ్చామని కానీ నేడు పిరికితనంతో జగన్‌ పారిపోయారని అన్నారు. అవహేళన చేసిన కౌరవసభను గౌరవ సభగా మార్చిన తర్వాతే సీఎంగా సభలో అడుగుపెడతానన్న తన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

chandrababu_on_ysrcp
chandrababu_on_ysrcp (ETV Bharat)

CM Chandrababu Comments on YSRCP:అత్యంత గౌరవప్రదమైన శాసనసభ సంప్రదాయాలను మంటగలిపి వికృత చేష్టలు, వింత పోకడలతో గత ఐదేళ్లు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించారని గద్గదస్వరంతో సీఎం వ్యాఖ్యానించారు. అవహేళన చేసిన కౌరవ సభను గౌరవసభగా మార్చి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టానని తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మనం వ్యవహరించొద్దని హుందాగా ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చుకుందామని సభ్యులకు పిలుపునిచ్చారు.

శాసనసభ స్పీకర్​గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడుని చంద్రబాబు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ శాసనసభ్యుడు, బీసీ నేతగా గుర్తింపు ఉన్న అయ్యన్నపాత్రుడు సభాపతి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 23 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. 7సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా, మంత్రిగా తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కీర్తించారు. రాజీపడని విలక్షణ నేతగా అయ్యన్న ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం - ఈటీవీపై ఆంక్షలు తొలగింపు - Speaker Ayyannapatrudu first sign

ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత: చట్టసభలకు రావడం అరుదైన అవకాశమని ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగా ఉండాలని మాట్లాడే విషయాలన్నీ రాష్ట్రమంతా చూస్తుందన్నారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే ప్రతి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టారని అలాంటి వ్యక్తులు రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించి మమ్మల్ని గెలిపించారని అన్నారు. గతంలో తనకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానం మరెవరికీ జరగనివ్వనని అన్నారు. ప్రజల ఆశీస్సులతోనే అసెంబ్లీలో సీఎంగా అడుగుపెట్టానని సీఎం చంద్రబాబు తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఎన్నికల్లోనూ దేశవిదేశాల నుంచి వచ్చి ఓట్లేశారన్నారు. ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత అని అన్నారు.

మనకెందుకు అనుమతులు అనుకున్నారేమో- అక్రమనిర్మాణాలపై వైఎస్సార్​సీపీకి నోటీసులు - GVMC Notices to YSRCP Office

వికసిత ఆంధ్రప్రదేశ్ మనకు కావాలి: మరోవైపు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు బాధ్యత ఇచ్చారని దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ సహకారంతో సాకారం చేసుకుందామని అన్నారు. భావితరాలకు భవిష్యత్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వికసిత ఆంధ్రప్రదేశ్ మనకు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును గౌరవించి తాము ఆనాడు సభకు వస్తే దేవుడి స్క్రిప్ట్‌ అంటూ జగన్ అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు 11 సీట్లు రావడం కూడా దేవుడి స్క్రిప్టేనా అంటూ ఎద్దేవా చేశారు.

'రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని జగన్ పట్టించుకోలేదు' - అధికారులతో పెమ్మసాని సమీక్ష - Pemmasani Meet in Railway Officals

Last Updated : Jun 22, 2024, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details