Telangana Phone Tapping Case Updates : గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అంతేగాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు కూడా పేర్కొనలేదని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్కు తమ అనుమతి అవసరంలేదని వివరించింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టి.వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు : కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల వరకు జరిమానా విధించచవచ్చని కౌంటర్లో కేంద్రం తెలిపింది. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలుంటాయని అదేవిధంగా రెండింటికీ వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయని తెలిపింది. అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నదానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉందని చెప్పింది. ఈ ఉత్తర్వులను సమీక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ వాటిని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. ఈ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని, మళ్లీ పొడిగించుకోవచ్చని గరిష్ఠంగా 180 రోజుల వరకు ఉంటాయంది. రికార్డులను కూడా 6 నెలల్లో ధ్వంసం చేయవచ్చని తెలిపింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం-23 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిందని వివరించింది.
అయితే ఇంకా నిబంధనలు రూపొందించలేదని అప్పటివరకు ప్రస్తుతం అమల్లో ఉన్న టెలిగ్రాఫ్ నిబంధనలే వర్తిస్తాయని స్పష్టంచేసింది. కొత్త చట్టం ప్రకారం, అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్కు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదంటే రూ 2 కోట్లు జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చని పేర్కొంది. ప్రస్తుత కేసుకు సంబంధించి తమ ప్రస్తావన లేదని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం పిటిషన్లో వివరణ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం నివేదిక : గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికిగాను ప్రణీత్రావుతో సహా నిందితులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నిందితులంతా వ్యక్తిగత అజెండాలతో అధికార పార్టీకి సహకరించడానికి చట్టనిబంధనలను వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది .అంతేగాకుండా అనుమతి లేకుండా పరికరాలను రికార్డులను ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో హోంశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.