BRS Leaders Joined Congress Party in Khammam :ఖమ్మంలో భారత రాష్ట్ర సమితికి ఝలక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) క్యాంపు కార్యాలయంలో హస్తం పార్టీలో చేరారు. ఖమ్మం అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమనే భావనతోనే ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు కార్పొరేటర్లు నిరీషారెడ్డి, శరత్, ప్రసాద్, విజయలక్ష్మి ప్రకటించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో తమ డివిజన్లను అభివృద్ధి చేసుకుంటామని వెల్లడించారు. ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి స్వార్థం, స్వలాభం కోసమే రాజకీయాలు చేశారని తుమ్మల విమర్శించారు. రాష్ట్రంలో ఖమ్మం ప్రతిష్ఠను పెంచేలా అందరినీ కలుపుకొని పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
"మొన్న ఎన్నికల్లో ఖమ్మం ప్రజానికం ఒకే మాట అడిగింది. ప్రశాంతమైన ఖమ్మం కావాలి. కబ్జాలు లేనటువంటి ఖమ్మం కావాలి. ఆరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి. అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలని చెప్పి గత ఎన్నికల్లో ప్రజలు కోరుకున్నారు. గత ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు ఏం అవసరం ఉన్న మీ మనిషిగా నేను పని చేస్తాను. మళ్లీ ఖమ్మం జిల్లా కీర్తి, ప్రతిష్ఠలను అందరం కాపాడుకోవాలి."- తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి
ఖమ్మంలో త్వరలో నూతన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు : తుమ్మల నాగేశ్వరరావు