తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్లోగా వెళ్లాలని నువ్వు నాకు చెబుతావా?' - అల్వాల్​లో వృద్ధుడిని చంపేసిన బైకర్! - BIKER ATTACK ON OLD MAN

సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణం - 15 రోజుల క్రితం బైక్​పై వేగంగా వెళ్తున్న యువకుడిని వారించిన వృద్ధుడు - వృద్ధుడిపై బైకర్ దాడి, చికిత్స పొందుతూ 15రోజుల తరువాత మృతి

Biker Attack On Old Man
Biker Attack On Old Man (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 7:49 PM IST

Biker Attack On Old Man : అతివేగం అనర్థదాయకం - ఈ మాట అందరూ తరచూ చెప్పేదే. రోడ్లపై రాష్​ డ్రైవింగ్ చేస్తూ వెళ్లే వాహనదారులకు పోలీసులు తరచూ చెప్పే మాటే ఇది. ఇంట్లో పెద్దలు కూడా తమ పిల్లలకు బైక్స్, కార్లలో వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లమని సూచిస్తుంటారు. కొందరు బైకర్ల రాష్ డ్రైవింగ్ రోడ్డుపై వెళ్లే వారి పాలిట ప్రాణాంతకం అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు రోజూ చాలానే జరుగుతుంటాయి. అయితే హైదరాబాద్ నగర పరిధిలోని అల్వాల్​లో జరిగిన ఘటన కాస్త భిన్నం.

స్లోగా వెళ్లాలని చెప్పినందుకు వృద్ధుడిపై దాడి :గత నెల సెప్టెంబర్ 30న అల్వాల్ పీఎస్​ పరిధిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆంజనేయులు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో బైక్​పై వేగంగా ఓ యువకుడు, యువతితో కలిసి ఆంజనేయులు పక్కనుంచి వెళ్లారు. ఆ వేగానికి భయపడ్డ ఆంజనేయులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.

ఆ మాటకే ఆగ్రహం చెందిన యువకుడు బైక్ ఆపి వచ్చి ఆంజనేయులుపై దాడి చేశాడు. యువకునితో పాటు ఉన్న యువతి ఆపేందుకు యత్నించినా ఆగలేదు. కోపంతో ఆంజనేయులను తోసేయడంతో కింద పడిపోయాడు. తరువాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆంజనేయులు కిందపడ్డప్పుడు రాయికి తగలడంతో తలకు బలమైన గాయమైంది.

మృత్యువుతో పోరాడుతూ మృతి :విషయం తెలిసిన కుటుంబసభ్యులు ముందుగా ఆ వృద్ధుడిని కేర్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. తరువాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆంజనేయులు ఈనెల 14న చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని కుమారుడు ఇవాళ అల్వాల్ పోలీస్​ స్టేషన్​లో నిందితునిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.

సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఘటనా దృశ్యాలు :దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు తెలుగు వాడు కాదని ఘటన జరిగినప్పుడు చూసిన ప్రత్యక్షసాక్షులు చెప్పినట్లు మృతుని కుమారుడు చెబుతున్నాడు. ఏదేమైనా నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే వృద్ధుడిపై చేయి చేసుకొని అతని చావుకు కారణమవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇలా రాష్ డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గుంతలో పడి గాల్లోకి ఎగిరిన కారు - మెదక్ జిల్లాలో ఏడుగురు దుర్మరణం
జహీరాబాద్‌, బీదర్‌ రహదారిపై ఘోర ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details