Fake RTO Case in Hyderabad : హైదరాబాద్లోని ఉప్పల్లో నకిలీ ఆర్టీవోల దందా అక్కడి పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే నకిలీ ఆర్టీవోల దందా మొదలవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉదయం 7గంటల లోపు ముగించుకుంటారు. గురువారం (నవంబర్ 21 న) నకిలీ ఆర్టీవో ప్రేమ్కుమార్ రెడ్డిని బాధితులు పోలీసులకు పట్టించారు.
తప్పించుకు తిరుగుతున్న ఉప్పల్లోని సెవెన్హిల్స్ కాలనీకి చెందిన సంతోష్ను శుక్రవారం (నవంబర్ 22) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్కుమార్రెడ్డి ఆటోడ్రైవర్, సంతోష్ అడ్డా కూలీ అని తెలిసి ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. వీరిద్దరూ కలిసి నకిలీ ఆర్టీవోలుగా అవతారమెత్తి అమాయక వాహనదారులను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున దందాకు తెరలేపారు. చివరకు వారే వీరిని పోలీసులకు పట్టించారు. అలాగే వీరికి ఈ దందా మూడు పూలు ఆరు కాయల లాగా బాగా జరిగిందని చూసినవాళ్లు అంటున్నారు.
నకిలీ ఆర్టీవో రోజుకు రూ. 500 కూలీ :నకిలీ ఆర్టీవోల దందాకు ప్రధాన సూత్రధారిగా ప్రేమ్కుమార్ రెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తోంది. కారులో కూర్చోని ఆర్టీవో పాత్ర సంతోష్ పోషిస్తున్నాడు. రోజూ ఉదయం కారులో సంతోష్ను తీసుకొని ప్రేమ్కుమార్ రెడ్డి నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్ ప్రాంతాలకు వెళ్తాడు. కారులో సంతోష్ను కూర్చొబెట్టి అతని వద్ద ఓ ల్యాప్టాప్, ఫైన్లు రాయడానికి రశీదు పత్రాలు ఉంచుతాడు. వచ్చిపోయే వాహనాలను ప్రేమ్కుమార్ రెడ్డి చూసి ఆపుతూ ఉంటాడు.