Attempt Murder on Inter Student in Kadapa District : ఏపీలోనికడప జిల్లా బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన కలకలం రేపింది. విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్కు తరలించారు. ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే విఘ్నేశ్ తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి వివాహమైనా వేధింపులు ఆపలేదని, ఇవాళ పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలింపు : గాయపడిన ఇంటర్ విద్యార్థినికి కడప రిమ్స్లో చికిత్స కొనసాగుతోందని కడప ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. 80శాతం గాయాలయ్యాయని చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉందని తెలిపారు. ఇద్దరూ బద్వేలు రామాంజనేయనగర్కు చెందినవారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేశ్ ఫోన్ చేశాడు. కలవకపోతే చనిపోతానని ఆమెను బెదిరించాడు. ఇద్దరూ పీపీకుంట చెక్పోస్టు సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారని ఆ తర్వాత విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేశ్ పరారయ్యాడని తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.