KARONDA CULTIVATION IN AP: కొరండా సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం సైతం ఉద్యాన రైతులకు ఊతమిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని ఉద్యాన రైతులు ప్రస్తుతం కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొరండా మొక్కల సాగు విస్తరణకు ఉద్యానశాఖ దృష్టి సారించింది. కొద్దిపాటి ముళ్లు కలిగి చిన్న చెట్లుగా వృద్ధి చెందే కొరండా మొక్కలు నీటి ఎద్దడి పరిస్థితులు తట్టుకుని వర్షాధార పంటగా వృద్ధి చెంది దిగుబడులు ఇస్తోంది.
సాగు విధానం ఇలా :కొరండా ప్రధాన పంటగా ఎకరాకు 250 మొక్కల చొప్పున నాటుకోవాలి. దీనికి పెద్దగా సాగు ఖర్చులు ఉండకపోగా మంచి దిగుబడి ఇస్తుంది. ఇతర పండ్ల తోటలు లేదా పొలం చుట్టూ కంచె పంటగా సైతం కొరండాను నాటుకోవచ్చు. పంట సాగుచేస్తే ప్రోత్సాహకంగా హెక్టారుకు రూ.30 వేలు రాయితీగా విడతల వారీగా మూడేళ్లు అందజేస్తారు.
వర్షాభావ పరిస్థితులు తట్టుకుని పంట దిగుబడినిచ్చి అదనపు ఆదాయంగా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. కొరండా మొక్కలు నేరుగా గానీ, ప్రభుత్వ నర్సరీలలో గానీ సేకరించి నాటుకోవచ్చు. ఉద్యాన శాఖాధికారులకు మొక్కల బిల్లులు అందజేస్తే రాయితీ మొత్తాన్ని పొలం పరిశీలన తర్వాత అందజేస్తారు. దీని సాగుకు చిత్తూరు జిల్లా అనుకూలం. ఆసక్తి కలిగిన రైతులు మొక్కలు సేకరించి నాటుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.