తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ పిల్లలు 24 గంటలూ ఫోనే చూస్తున్నారా? - ఇలాంటి ప్రమాదాల బారిన పడే ఛాన్స్! - SOCIAL MEDIA IMPACT ON CHILDREN

సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్న పిల్లలు - తెలిపిన వార్షిక విద్యాస్థితి (అసర్) నివేదిక

SOCIAL MEDIA IMPACT ON CHILDREN
Children on Social Media (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 2:17 PM IST

Children on Social Media :పిల్లలు ఫోన్లలో సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను విద్యా ప్రయోజనాల కోసం కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం ఉంటున్నారని వార్షిక విద్యాస్థితి (అసర్) నివేదిక- 2024 తెలిపింది. ఇందులో చాలా మందికి ఆన్​లైన్​లో తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి కావాల్సిన డిజిటల్ అక్షరాస్యత లేదు. రాష్ట్రంలో 1775 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొనగా వీరిలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందినవారే ఎక్కువ ఉన్నారు.

సామాజిక మాధ్యమాలకే అధిక సమయం : 14-16ఏళ్ల పిల్లలున్న 96%గృహాల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 14ఏళ్ల పిల్లలు 31.10%, 15ఏళ్లవారు 29%, 16ఏళ్లవారు 46.60% మంది సొంతంగా స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్న 14-16ఏళ్ల విద్యార్థులు 82.50% మంది సామాజిక మాధ్యమాలను వీక్షించటానికే అధిక సమయం కేటాయిస్తున్నారు. వీరిలో బాలురు84.80%, బాలికలు 79. 90%మంది ఉన్నారని నివేదిక తెలిపింది. సామాజిక మాధ్యమాల అధిక వినియోగం పిల్లల భవితపై పెనుప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కలవరపరుస్తున్న డిజిటల్ అక్షరాస్యత : వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ కలిగిన 14ఏళ్ల పిల్లల్లో కేవలం 55.10% మందికి మాత్రమే తమ ప్రొఫైల్‌ను ఎలా బ్లాక్‌ చేయాలో తెలుసు. 15ఏళ్ల పిల్లల్లో 62.30% మాత్రమే తమ పాస్‌వర్డును మార్చగలరు. 16ఏళ్ల వయసు వారిలో 70% మందికే ప్రొఫైల్‌ బ్లాక్‌ చేయటం, మార్చటం, కొత్త పాస్‌వర్డ్‌ నమోదు చేయటం వంటి వాటిపై అవగాహన ఉంది. పిల్లల్లో డిజిటల్‌ అక్షరాస్యత లేకపోవటం వల్ల సైబర్‌ మోసాలకు గురవటం, ఆన్‌లైన్‌ జూదాలు, లోన్‌యాప్‌ల బారినపడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సెల్‌ఫోన్‌ చూస్తే ఎదురయ్యే సమస్యలు :

  • గంటల తరబడి సెల్‌ఫోన్‌ చూస్తే పిల్లల్లో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎక్కువగా కంటి సమస్యలు వచ్చే అవకాశముంటుంది. కదలిక లేకుండా స్మార్ట్‌ఫోన్లతో ఎక్కువ సమయం గడపటం వల్ల బరువు పెరగటం, నిద్రలేమి సమస్యలు వస్తాయి.
  • బయటవారితో ఎక్కువ మాట్లాడరు. దీనివల్ల స్నేహాలు తగ్గుతాయి. ఆన్‌లైన్‌ సంబంధాలపై పిల్లలు అధికంగా ఆధారపడాల్సి వస్తుంది.
  • ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటం వల్ల చదువుకు చాలా ఇబ్బందులు కలుగుతాయి.

స్క్రీన్‌ సమయం తగ్గించాలి :

  • పిల్లల స్క్రీన్‌ టైమ్‌కు సమయపాలన నిర్దేశించాలి. నిద్రపోయే సమయంలో ఫోన్​వాడకుండా చూడాలి.
  • దినపత్రికలు, పుస్తకాలు చదవడం వల్ల సమాజంపై అవగాహన పెరుగుతుందని వివరించాలి.
  • సైక్లింగ్, స్విమ్మింగ్‌తో పాటు క్రియాత్మక పనులు చిత్రకళ, సంగీతం, రచన వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
  • ఫోన్‌లో పేరెంటల్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. ఇది వెబ్‌సైట్‌లను నిరోధించటంతో పాటు స్క్రీన్‌ టైమ్‌ను నియంత్రిస్తుంది.
  • ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్‌ వాడకాన్ని తగ్గించి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. సామాజిక మాధ్యమాల కంటే దినపత్రికలు, పుస్తకాలు చదవడం వల్ల అధికంగా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని గ్రహించాలి.

లైన్‌ దాటి అతిగా ప్రవర్తిస్తే జైలుకే - ఎలాగో తెలుసుకోండి

ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్నారని రెచ్చిపోకండి - సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లకు సజ్జనార్ స్వీట్ వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details