Land Mafia in Adilabad Kailash Nagar :ఆదిలాబాద్ పట్టణ పరిధిలోకి వచ్చే కైలాస్నగర్ కాలనీ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేయటం కలకలం రేపింది. దశాబ్దాల కిందట ప్రభుత్వం కైలాస్నగర్ సొసైటీ పేరిట నామినల్ ధరకు 20 ఎకరాలను కేటాయించింది. ఇందులో కైలాస్నగర్లోని గృహ నిర్మాణాల కోసం పోను మిగిలిన ఎనిమిది గుంటలను ఫంక్షన్హాల్ కోసం సొసైటీ ఖాళీగానే ఉంచింది.
దాదాపుగా రూ. కోట్ల విలువ చేసే ఈ స్థలానికి ప్రహారీ నిర్మించేందుకు ప్రయత్నించగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అది తమ భూమి అంటూ నకిలీ దస్తావేజులు తీసుకురావటంతో కబ్జాకు గురైనట్లు వెల్లడి కావటం చర్చనీయాంశమైంది. బాధ్యులపై చర్య తీసుకోవాలని సొసైటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అధికారుల బృందం విచారణ చేపట్టింది.
"భూ మాఫియా రెచ్చిపోయి, దొంగ పత్రాలతో ఇక్కడ రెండు, మూడు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి ఇళ్లు కట్టడానికి ప్రయత్నించారు. అయితే మా కాలనీ వాళ్లందరం కలిసి ప్రహరీ నిర్మించాలని అనుకున్నాం. మేము నిర్మాణం చేపట్టగానే కబ్జాదారులు మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి ఇక్కడ అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణం ఆగిపోయింది. కలెక్టర్ దగ్గరకు వెళ్తే కమిటీ వేశారు." - ప్రవీణ్ రెడ్డి, కైలాస్నగర్ సోసైటీ అధ్యక్షులు