Rangarajan Attack Case Updates :చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ మాట వినకుంటే అపహరిస్తామని, పరిస్థితులు దారుణంగా ఉంటాయని రంగరాజన్ను నిందితుడు వీర్ రాఘవ రెడ్డి బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే పురోహితులే లక్ష్యంగా చేసుకుని చేసుకుని వీర్ రాఘవ రెడ్డి తిరుగుతున్నాడని, తన భావజాలాన్ని అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని ఫాలోవర్లతో ప్రతిజ్ఞ చేయించాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకూ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో 8 మంది పరారీ :రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో మోయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వీర్ రాఘవ రెడ్డితో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వీర్ రాఘవ రెడ్డి తూర్పు గోదావరికి చెందిన వాడు కాగా నిజామాబాద్కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలను ఈ నెల 8న అరెస్ట్ చేశారు.
తాజాగా శ్రీకాకుళంలో ఐదుగురు, వరంగల్లో ఒకరు, భద్రాచలంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిందితుల నుంచి దాడి చేసేందుకు వెళ్ళిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వీర్ రాఘవ రెడ్డిపై అబిడ్స్లో లైంగిక వేధింపుల కేసు, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్లలో సైతం కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా నిందితుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు పొందుపరిచారు.
గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక సమావేశాలు :తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కొప్పవరానికి చెందిన వీర్ రాఘవ రెడ్డి మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటూ సంగీతం మాస్టర్గా పని చేస్తున్నాడు. 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంధ్రా పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మూసాపేట్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించాడు. హిందూ ధర్మాన్ని ఇతర మతాలు నాశనం చేస్తున్నాయని, కోర్టులు పోలీసులు దీనిపై పని చేయట్లేదని, ఇందుకోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రామ రాజ్య స్థాపనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ముఖ్యమని తెలిపినట్లు పేర్కొన్నారు. తనకు తాను ముక్కంటి అవతారంగా ప్రచారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఛానెళ్లు ప్రారంభించి భగవద్ఘీత శ్లోకాలు చెప్తూ కొందరు ఫాలోవర్లను సంపాదించుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రామ దండును తయారు చేసేందుకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. రామ దండుకు విరాళాలు సేకరించేందుకు కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఎన్జీవో ఏర్పాటు చేసి, భార్యను ఛైర్మన్గా పెట్టి తాను అధ్యక్షుడుగా ఉన్నాడన్నారు. తనకు పరిచయం ఉన్న ఉత్తర్ ప్రదేశ్కి చెందిన శ్యామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజ్యం వెబ్సైట్ను తయారు చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. గతంలో మణికొండ గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక సమావేశాలు వీర్ రాఘవ రెడ్డి ఏర్పాటు చేశాడని, రాజ్యాగంలో ఆర్టికల్ 25, 30 గురించి ప్రసంగాలు ఇచ్చినట్లు తెలిపారు.