Pakistan Cricket Stadiums:పాకిస్థాన్లోని స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాల మధ్య ఉన్న అంతరాన్ని పీసీబీ ఛైర్మన్ నఖ్వీ ఎత్తిచూపారు. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న స్టేడియాలు ఏవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేవని చెప్పారు. 'మా స్టేడియాలకు, ప్రపంచంలోని మిగిలిన స్టేడియాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఏ స్టాండర్డ్స్ పరంగానూ అవి అంతర్జాతీయ స్థాయి అనిపించుకోవు. స్టేడియాల్లో తగినన్ని సీట్లు లేదా బాత్రూమ్లు కూడా లేవు. స్టేడియంలో వ్యూని పరిశీలిస్తే 500 మీటర్ల దూరం నుంచి మ్యాచ్ చూస్తున్నట్లు అనిపించింది' అని చెప్పాడు.
ప్రధాన పునర్నిర్మాణ ప్రణాళికలు
ఈ సమస్యలను పరిష్కరించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ రెనోవేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది. లాహోర్లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను అప్గ్రేడ్ చేయడంపై దృష్టి పెట్టింది. 2025 ఫిబ్రవరి- మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు రూ.12.8 బిలియన్లు అవసరం అవుతుందని అంచనా.
సకాలంలో పనులు పూర్తవుతాయా?
పనుల పురోగతిని సమీక్షించేందుకు గడ్డాఫీ స్టేడియంను నఖ్వీ సందర్శించాడు. రెనొవేషన్ పనులు సకాలంలో పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO) నిరంతరాయంగా శ్రమిస్తోందని ప్రశంసించాడు. 'మేము మా స్టేడియంలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత' అని నఖ్వీ చెప్పాడు.