LSG IPL 2025 Mega Auction :2025 ఐపీఎల్ రిటెన్షన్స్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. నలుగురు భారత ఆటగాళ్లు, ఒక ఫారిన్ ప్లేయర్తో సహా ఐదుగురిని లఖ్నవూ అట్టిపెట్టుకుంది. దీంతో లఖ్నవూ పర్స్ వ్యాల్యూ భారీ మొత్తంలోనే ఉంది. రూ.69 కోట్లతో లఖ్నవూ మెగా వేలంలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మెగా వేలంలో తమ స్ట్రాటజీ గురించి హింట్ ఇచ్చాడు. గతంలో తమ జట్టులో ఆడిన ఆటగాళ్లలో ఎక్కువ మందిని వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.
'ఎన్నో చర్చలు జరిపిన తర్వాతే రిటెన్షన్ ఫైనలైజ్ చేశాం. భారత్లో ప్రస్తుతం ఉన్న యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్తో జట్టు నిర్మాణానికి గట్టి పునాదిని ఏర్పాటు చేస్తున్నాం. ఇక నికోలస్ పూరన్ వరల్డ్ క్రికెట్లోనే డైనమిక్ ప్లేయర్. ఇంకా మాకు ఒక ఆర్టీఎమ్ ఆప్షన్ ఉంది. అయితే గత సీజన్లలో లఖ్నవూ తరఫున ఆడిన ప్లేయర్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని వేలంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నాం. సంజీవ్ గోయెంకా (జట్టు ఓనర్) కూడా రిటెన్షన్స్ గురించి చాలా ఆలోచించారు. నెక్ట్స్ రిటెన్షన్స్ సమయంలో మాకు కఠిన పరిస్థితి ఎదురవుతుది అనుకుంటున్నా' అని లాంగర్ పేర్కొన్నాడు.
RTM రాహుల్ కోసమేనా?
లఖ్నవూ వద్ద ఒక ఆర్టీఎమ్ ఆప్షన్ ఉంది. ఇక ప్రస్తుత రిటెన్షన్స్లో ఉన్న ప్లేయర్లలో పూరన్కు తప్ప పెద్దగా ఎవరికీ కెప్టెన్సీ అనుభవం లేదు. వేలంలో పాత ప్లేయర్లపైన తమ దృష్టి ఉంటుందని లాంగర్ తాజాగా స్పష్టం చేశాడు. దీంతో వేలంలో ఆర్టీఎమ్ ఉపయోగించి రాహుల్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు!