India A vs India B Duleep Trophy 2024:2024 దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్లో ఇండియా బి విజయం సాధించింది. ఇండియా ఎ పై 76 పరుగుల తేడాతో నెగ్గింది. ఓవర్ నైట్ స్కోరు 150/6తో నాలుగో రోజు, ఆటను కొనసాగించిన ఇండియా బి మరో 34 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఎ 198 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (57 పరుగులు; 121 బంతుల్లో: 7x4) హాఫ్ సెంచరీతో రాణించగా, రియాన్ పరాగ్ (31 పరుగులు, 18 బంతుల్లో), ఆకాశ్ దీప్ (43; 42 బంతుల్లో 3x4, 4x6) ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. ఇక ఇండియా బి జట్టులో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ తలో 2, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో 1 వికెట్ పడగొట్టారు. కాగా , తొలి ఇన్నింగ్స్లో భారీ శతకంతో (181 పరుగులు, 373 బంతుల్లో, 16x4, 5x6) అదరగొట్టిన ముషీర్ ఖాన్ మ్యాన్ 'ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' అందుకున్నాడు.
ఆదుకున్న ముషీర్
కాగా, తొలి ఇన్నింగ్స్లో ఇండియ బి జట్టు 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ జట్టును ఆదుకున్నాడు. భారీ ఇన్నింగ్స్లో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియా బి 321 పరుగులు చేసింది. ఇక ఇండియా ఎ లో ఆకాశ్ దీప్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఎ 231 పరుగులకు ఆలౌటైంది. టీమ్లో ఎవరు కూడా హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
విఫలమైన గిల్, యశస్వి
ఇండియా ఎ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు ఇన్నింగ్స్లలో వరుసగా (25 పరుగులు, 21 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు చేరాడు. మరోవైపు ఇండియా బి ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ కూడా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్లో 30 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించినా, కీలకమైన రెండో ఇన్నింగ్స్లో 9 పరుగులుకే ఔటయ్యాడు.