Vasudeva Dwadashi 2024 :ఆషాడ శుద్ధ ద్వాదశి అంటే తొలి ఏకాదశి మరుసటి రోజు జరుపుకొనే పండుగ. దీనినే వాసుదేవ ద్వాదశి అని కూడా అంటారు. వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని ఆరాధన విశేషంగా చేస్తారు. వసుదేవుడంటే ఆ శ్రీమన్నారాయణుడే! వాసుదేవుని కుమారుడుగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆయనకు వసుదేవుడని పేరు వచ్చింది. స్మృతి కౌస్తుభంలో వాసుదేవ ద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది. జులై 18వ తేదీ వాసుదేవ ద్వాదశి సందర్భంగా అసలు వాసుదేవ ద్వాదశి అంటే ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈనాటి నుంచే చాతుర్మాస దీక్ష!
సాధారణంగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఆషాఢ మాసంలో చేపట్టే చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని చెబుతోంది స్మృతి కౌస్తుభం.
పరమాత్మ పరిపూర్ణ అవతారమే వాసుదేవుడు
వాసుదేవుడు అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే. విష్ణువు నామాల్లో ప్రతి నామానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ప్రత్యేకత ఉంది. వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నింటిలో వసించు వాడు కునుక వాసుదేవుడు అని అంటారు. విష్ణు సహస్రనామంలో 'సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే' అనే వాక్యానికి ఇదే అర్ధం. అర్జునుడు కృష్ణుణ్ని వాసుదేవా అనే పిలిచే వాడంట!
వాసుదేవ ద్వాదశి ఎలా జరుపుకోవాలి?
వాసుదేవ ద్వాదశి ముందు రోజున తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు వాసుదేవ ద్వాదశి రోజు విష్ణుమూర్తి పూజ చేసి భోజనం చేయవచ్చు. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిధి ద్వాదశి. శయన ఏకాదశి తర్వాత వచ్చే వాసుదేవ ద్వాదశికి ప్రాముఖ్యం ఎక్కువ. వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి స్మృతి కౌస్తుభం పురాణంలో కూడా ప్రత్యేకంగా చెప్పలేదు.
ఉపవాసం అవసరం లేదు
వాసుదేవ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని తులసీదళాలతో అర్చించాలి. చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం భోజన నియమాలు పాటిస్తే చాలు. ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం. అలాగే గోపద్మ వ్రత కథను కూడా ఈ రోజు తప్పకుండా చదవాలి.
గోపద్మ వ్రతం అంటే?
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం. దీనిని సుమంగళి మహిళలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు.
గోపద్మ వ్రత పూజా విధానం
గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజిస్తారు. ప్రతినిత్యం గోశాలను శుభ్రపరచి, వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవు దూడలను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. ఆవు శరీరంపై ఆరు మోహినీ దేవతలకు ప్రతీకగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణలు చేస్తారు, 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు. మళ్లీ ఆరుగురు మోహినీ దేవతలకు ఆరు సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. 33 తీపి పదార్థాలు దానం చేస్తారు. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి, అక్షతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి. పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి, తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఒకవేళ గోశాల అందుబాటులో లేనివారు ఇంట్లో గోవు, దూడ బొమ్మను పెట్టుకుని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు.
గోపద్మ పూజను ఇలా కొనసాగించాలి
ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పినా, ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి. ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు.
గోపూజ హిందూ సంస్కృతికి ప్రతిబింబం
హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు.