తెలంగాణ

telangana

ఋషి పంచమి పూజ చేస్తున్నారా? మీకోసమే సింపుల్​గా వ్రత కథ! - Rishi Panchami 2024

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 9:34 AM IST

Rishi Panchami Vrat Katha : ఏ వ్రతమైనా, నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రతకధ చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. భాద్రపద శుద్ధ పంచమి రోజు జరుపుకునే ఋషి పంచమి పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా! ఈ కథనంలో వ్రత కథను తెలుసుకుందాం.

Rishi Panchami Vrat Katha
Rishi Panchami Vrat Katha (Getty Images)

Rishi Panchami Vrat Katha : ఒకసారి ధర్మరాజు శ్రీకృషునితో అన్ని వ్రతములలోకి ఉత్తమమైనది ఏది? స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే తెలిసి తెలియక చేసిన దోషములు పోతాయి? అని అడుగగా ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా! 'చేసిన పాపములు పోగొట్టే ఉత్తమమైన వ్రతమొకటి కలదు. అదే ఋషి పంచమి వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను వినుము' అంటూ చెప్పసాగెను.

పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు సుశీల ఈమె పతివ్రత. ఈ దంపతులకు సుభీషణుడు అను కొడుకు, ఒక కుమార్తె ఉండేవారు. సుభీషణుడు వేద వేదాంగాలను చదివి పండితుడయ్యాడు. కుమార్తెను ఒక బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించారు. కర్మవశాత్తు ఆమె వైధవ్యము పొంది తన తండ్రి ఇంట్లో కాలము గడుపుచుండెను. ఉదంకుడు తన కుమార్తె పరిస్థితికి బాధ పడుచు భార్యను, కుమార్తెను తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ అడవులలోనే నివసిస్తూ ఉండేవాడు.

ఉదంకుని కుమార్తె ఒకనాటి రాత్రి తన తండ్రికి పరి చర్యలు చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ద రాత్రి వేళ ఆమె దేహమంతా పురుగులు పట్టాయి .ఇలా శరీరమంతా పురుగులతో నిండియున్న ఆమెను చూసి ఉదంకుని శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. కుమార్తె దుస్థితి చూసి తల్లి బాధతో ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకొని తన భర్త ఐన ఉదంకుని దగ్గరకు పోయి, జరిగినదంతా వివరించి చెప్పి, ఇందుకు కారణం తెలుపమని కోరింది. ఉదంకుడు కొంత సేపు ధ్యాన ముద్రలో ఉండి తన దివ్యదృష్టితో ఆమె పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకొని తన భార్యతో ఇలా చెప్పాడు.

ఓ ప్రాణేశ్వరీ! 'మన కుమార్తె తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా జన్మించి కూడా రజస్వల అయిన సమయంలో ఇంటికి దూరంగా ఉండక ఇంటి పనులు అన్ని చేయుచూ అన్నం, కూర, పప్పు వంటి భోజన పదార్థాలు, వంట పాత్రలు తాకి పాపం చేసింది. ఆ పాప ఫలితంగా కలిగిన దోషము వలన ఈ జన్మలో ఆమె శరీరమంతా ఇలా పురుగులు వ్యాపించాయి. ఎన్ని జన్మల తరువాత అయిన పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు ఆమె ఆ దోష ఫలితాన్ని అనుభవిస్తోంది' అని చెప్పాడు.

బ్రాహ్మణ స్త్రీ ఋతు సమయంలో విడిగా ఉండకుండా ఇల్లంతా కలియ తిరిగితే బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది. అంతేకాకుండా మన కుమార్తె పూర్వ జన్మలో కొందరు బ్రాహ్మణ స్త్రీలు ఋషి పంచమి వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగులు వ్యాపించాయి. తెలిసో తెలియకో ఆ వ్రతాన్ని కళ్లారా చూడటం వల్ల ఈ జన్మలో కూడా ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ కలిగింది. ఇప్పుడు ఈమె మరల ఋషి పంచమి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది' అని ఉదంకుడు తన భార్యతో చెప్పాడు.

ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తూ 'ఓ ధర్మరాజా! ఏ స్త్రీ ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తి పొంది ఇహ లోకమున చాలా కాలం పుత్ర పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యంతో స్వర్గలోకము చేరి చివరకు మోక్షము పొందును" అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.

ఋషి పంచమి వ్రతం చేసే వారికి ఈ నియమాలు తప్పనిసరి
ఋషి పంచమి వ్రతం చేసే మహిళలు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనంలో కూడా ధాన్యం, పాలు, పంచదార, పెరుగు, ఉప్పు, పులుపు, ఉడికించినవి, కాల్చినవి, నూనె, కారం వంటివి లేకుండా భుజించాలి. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణులను యథావిధిగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details