Balarama Jayanti Puja Vidhi In Telugu : శ్రావణ బహుళ షష్టి రోజున బలరామ జయంతిని జరుపుకుంటాం. పోతన మహాకవి రచించిన భాగవతంలో కూడా బలరామ జయంతి గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఏడాది ఆగస్టు 24 వ తేదీ ఉదయం 07:52 నిమిషాలకు షష్టి తిథి మొదలై ఆగస్టు 25న 05:31 నిమిషాలకు పూర్తవుతోంది కాబట్టి ఆగస్టు 24వ తేదీనే బలరామ జయంతిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు పూజ చేసుకోవడానికి శుభసమయం.
బలరామ జయంతి పూజ ఎలా చేయాలి?
బలరామ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై బలరాముడు, శ్రీకృషుని చిత్రపటాలను గంధం, కుంకుమలతో అలంకరించాలి. శంఖు పూలు, పొగడ పూలు, పారిజాత పూలతో బలరామ కృష్ణులను పూజించాలి. అటుకులు, పాలు, వెన్న, మీగడ వంటి పదార్థాలతో ప్రత్యేకమైన నైవేద్యాన్ని తయారు చేసి బలరామ కృష్ణులను నైవేద్యంగా సమర్పించాలి. పూజ చేసుకునే వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.
దేవాలయాలలో ఇలా!
దక్షిణ భారతంలో కన్నా ఉత్తర భారతంలో బలరామ జయంతిని ఆలయాలలో ఘనంగా చేస్తారు. ఈ రోజు సాయంత్రం ఆలయాల్లో బలరాముడు, కృషుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. భక్తులందరూ కలిసి దేవునికి సమర్పించడానికి ప్రత్యేక భోగ్ అనగా నైవేద్యం సిద్ధం చేసి, దానిని ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు.