Airport Police Stop to YSRCP Leader Devineni Avinash : విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్కు చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాశ్పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు ఆయనకు అడ్డు చెప్పడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయ దాడిలో పాల్గొన్న వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు.
కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నం :గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దేవినేని అవినాష్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయి. దాడి కేసులోని వైఎస్సార్సీపీ నేతలు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అవినాష్ను ముందస్తు అరెస్టు చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుకు సంబంధించిన వాదనలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దుబాయ్కి పారి పోయేందుకు ఆయన యత్నించారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అవినాష్ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దేవినేని అవినాష్పై ఎఫ్ఐఆర్ ఉందని అతనిని అడ్డుకోవాలని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు చెప్పడంతో దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు.