CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సీఎం హోదాలో తొలిసారిగా దిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో పాటు ఆర్థిక సంఘం చైర్మన్ను కూడా కలిసి ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దిల్లీ పర్యటన అంటే కేంద్ర పెద్దల్లో ఒకరిద్దరిని మాత్రమే మర్యాదపూర్వకంగా కలవడం పరిపాటి. కానీ, రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు తొలిపర్యటన సాగిన తీరు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు.
2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ, అప్పట్లో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తన పదవీ కాలంలో 29సార్లు దిల్లీకి వెళ్లొచ్చారు. ఆయన ప్రతీ పర్యటన రహస్యమే. దిల్లీ ఎందుకు వెళ్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో! ఏ విషయాలు చర్చిస్తున్నారో! ఏ ఒక్కరికీ అంతు చిక్కేది కాదు. పోలవరం నిధుల కోసమంటూ ఆపార్టీ నేతలు ఊదరగొట్టినా, ప్రాజెక్టు నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నది వాస్తవం. ప్రజా ధనంతో ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లిన జగన్. రాష్ట్రానికి సాధించిందేమీ లేదన్నది జగమెరిగిన సత్యం. జగన్ దిల్లీ పర్యటనల ఆంతర్యమేమిటని అప్పట్లో ప్రతిపక్షాలు నిలదీశాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డాయి.