BRS MLC Challa Venkatarami Reddy Met CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్యలపై చల్లా, రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు రాయిచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని, ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరారు. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల వారికి కర్నూలు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గత వారం, పది రోజులుగా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డిలు కాంగ్రెస్లో చేరతారని హస్తం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్నగర్ వెళ్తున్నందున, ఆ పర్యటనలో వీరిద్దరూ కాంగ్రెస్లో చేరతారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్కు భారీ షాక్ - కాంగ్రెస్ గూటికి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు - 6 BRS MLCs JOINED CONGRESS
పాలమూరుతో సీఎం జిల్లాల పర్యటన షురూ : ఇదిలా ఉండగా, జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం, 12 గంటల 45 నిమిషాల వరకు ఐడీఓసీ వద్దకు చేరుకొని మొక్కలు నాటుతారు. అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రముఖులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం సుమారు మూడున్నర గంటల పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాగు నీటి ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. వారానికి ఒక జిల్లాలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత పాలమూరు జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, ఈ నెల 15న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
ఆ 6 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ - 2025 మార్చి నాటికి పూర్తయ్యేలా ఆదేశాలు జారీ