తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వారసుల విజయం కోసం కన్నడ 'సీనియర్' నేతల ఆరాటం- ఖర్గే, యడియూరప్పకు చాలా ముఖ్యం! - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Polls Uttar Kannada Politics : కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడతలో ఉత్తర కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు మే ఏడున పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే దక్షిణ కర్ణాటకలో పోలింగ్‌ పూర్తవ్వగా ఈ దశలో జరిగే పోలింగ్‌తో కర్ణాటకలో ఎన్నికలు ముగుస్తాయి. లోక్‌సభ ఎన్నికల మలి విడత పోలింగ్‌ జరిగే స్థానాల్లో గెలుపు సీనియర్‌ నేతలకు సవాల్‌గా మారింది. పార్టీపై తమ పట్టు నిలుపుకోవాలన్నా ఉనికిని కాపాడుకోవాలన్నా ఎదురవుతున్న సవాళ్లకు సమాధానం చెప్పాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు అగ్ర నేతలకు తప్పనిసరి. దీంతో ఉత్తర కర్ణాటకలో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది.

Lok Sabha Polls Uttar Kannada Politics
Lok Sabha Polls Uttar Kannada Politics (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 7:36 AM IST

Updated : May 3, 2024, 7:50 AM IST

  • బరిలోకి దిగిన వారసులు
  • నేతల భావోద్వేగ ప్రసంగాలు
  • గెలుపు తలుపు తట్టేందుకు వ్యూహాలు
  • తమ ప్రభావం, ప్రాభవం తగ్గలేదని నిరూపించుకునేందుకు సీనియర్ల ప్రణాళికలు

ఇవన్నీ కలిసి ఉత్తర కర్ణాటకలో రాజకీయ వేడి పతాకస్థాయికి చేరింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో ఏప్రిల్‌ 26న దక్షిణ కన్నడ ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. మూడో విడతలో ఉత్తర కర్ణాటకలోని మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్‌ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తర కర్ణాటకలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు సీనియర్‌ నేతలు, మంత్రుల వారసులు ఉండడం వల్ల ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.

Lok Sabha Polls Uttar Kannada Politics :చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్న నేతలను చూసి ఆయా పార్టీల అధిష్ఠానాలు వారి వారసులకు టికెట్లు కేటాయించాయి. జాతీయ పార్టీల్లో సీనియర్లు, మంత్రులు గెలుపు హామీలిచ్చిన తర్వాతే వారి వారసులకు అధిష్టానాలు టికెట్లను కేటాయించాయి. ఈ హామీతో వారసులు గెలిచినా ఓడినా పూర్తి బాధ్యత వారి ఇంటి పెద్దలదే కానుంది. దీంతో ఉత్తర కర్ణాటకలో లోక్‌సభ పోరు సీనియర్లకు మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

కాంగ్రెస్‌ ముందంజ!
ఉత్తర కర్ణాటకలోని మొత్తం 14 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన మొత్తం 28 మంది ప్రధాన అభ్యర్థుల్లో 10 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరిలో కేవలం ఇద్దరికే ఇంతకుముందు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. మిగిలిన 8 మంది కనీసం స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం కూడా లేదు. అగ్రనేతల వారసులు, బంధువులను బరిలోకి దింపిన పార్టీల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. ఈ విడతలో బీజేపీ కేవలం ఇద్దరు వారసులనే బరిలో దింపగా కాంగ్రెస్‌ 8 మందిని పోటీకి నిలిపింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ పెద్దలకే తమ వారసులను గెలిపించే బాధ్యత ఎక్కువగా ఉంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు సీనియర్ల భవిష్యత్తుకు ప్రతిష్ఠకు సవాలుగా మారాయి.

ఖర్గేకు చాలా ముఖ్యం
ఉత్తర కర్ణాటకలో గెలుపు అనివార్యమైన వారిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఖర్గే వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన కలబురగి నియోజకవర్గంలో 2019లో తన రాజకీయ జీవితంలోనే తొలి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. తనకున్న ఏఐసీసీ బాధ్యతలు, రాజ్యసభ సభ్యత్వం కారణంగా కలబురగి నియోజవర్గం నుంచి మళ్లీ పోటీ చేయలేక అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని ఖర్గే ఎన్నికల బరిలో దింపారు. ఇటీవల ఖర్గేలో కలబురగిలో ప్రచారం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

అల్లుడి కోసం పోరాటం!
తన అల్లుడిని గెలిపించకపోతే తనకు ఈ చోట స్థానం లేనట్లే అని, మీ హృదయాల్లో తనకు చోటు లేదని, కనీసం తన అంతిమ సంస్కారానికైనా రావాలని ఖర్గే ఓటర్లను అభ్యర్థించారు. ఖర్గే లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఇలా భావోద్వేగానికి గురయ్యారంటే ఖర్గేకు అల్లుడి గెలుపు ఎంత కీలకమో అర్థమవుతోంది. తన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే సాయంతో తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ఖర్గే ప్రయత్నం చేస్తున్నారు. తన రాజకీయ మార్గదర్శకత్వంలోనే ఎదిగి, ప్రత్యర్థిగా మారి, బీజేపీ అభ్యర్థిగా మారిన ఉమేశ్‌ జాదవ్‌ ఇక్కడ పోటీ పడుతుండటం ఖర్గేకు కంటగింపుగా మారింది. 2019 ఎన్నికల్లో జాదవ్‌ చేతిలోనే ఖర్గే ఓటమి పాలయ్యారు.

యడియూరప్పకు కూడా
ఈ ఎన్నికలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్పకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. శివమొగ్గ నుంచి యడియూరప్ప ఇద్దరు కుమారుల్లో పెద్దవారైన బి.వై.రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప చిన్న కుమారుడు విజయేంద్ర ఉన్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు రాఘవేంద్రకు టికెట్‌ ఇవ్వడంపై పార్టీలో పలువురు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

కుమారుడు గెలుపు తప్పనిసరి!
కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండే బీజేపీ కర్ణాటకలో యడియూరప్ప కుటుంబం చేతుల్లో చిక్కుకుందని సీనియర్‌ నేతలు ఈశ్వరప్ప, సి.టి.రవి, బసవన గౌడ యత్నాళ్‌ వంటి సీనియర్లు ఆరోపించారు. యడియూరప్పపై ఆగ్రహంతో ఉన్న ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇది బీజేపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతకు బదులివ్వాలంటే కుమారుడు రాఘవేంద్ర గెలుపు యడియూరప్పకు తప్పనిసరైంది. సొంత జిల్లాలో కుమారులిద్దరి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఈ ఎన్నికల్లో రాఘవేంద్రను గెలిపించడం యడియూరప్పకు అనివార్యంగా మారింది.

99 ఏళ్ల శివశంకరప్పకు కూడా అంతే!
కర్ణాటక శాసనసభలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా ఉన్న 99 ఏళ్ల శ్యామనూరు శివశంకరప్ప కాంగ్రెస్‌ పార్టీతో గొడవ పడి మరీ కోడలు ప్రభా మల్లికార్జునకు టికెట్‌ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో లింగాయత్‌ల ప్రాభవాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉన్న ఆయన కోడలి గెలుపు తన గెలుపుగా భావించి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రుల వారసులు కూడా ఈ విడతలో ఎన్నికల బరిలో నిలిచారు. బెళగావిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మృణాల్‌ హెబ్బాళ్కర్‌ తల్లి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కర్ణాటక మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రిగా ఉన్నారు. బాగల్‌కోటెలో పోటీ చేస్తున్న సంయుక్తా పాటిల్‌ తండ్రి శివానంద పాటిల్‌ కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

వారసుల విజయం కోసం ఆరాటం!
బీదర్‌లో పోటీ చేస్తున్న సాగర్‌ ఖండ్రే తండ్రి ఈశ్వర ఖండ్రే అటవీశాఖ మంత్రికాగా చిక్కోడి బరిలో నిలిచిన ప్రియాంక జార్ఖిహొళి తండ్రి సతీశ్‌ జార్ఖిహొళి కూడా మంత్రిగా ఉన్నారు. దావణగెరె అభ్యర్థి ప్రభ భర్త మల్లికార్జున శివమొగ్గ అభ్యర్థి గీతా శివరాజ్‌ కుమార్‌ సోదరుడు మధు బంగారప్ప కూడా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వీరు తమ కుటుంబీకులను గెలిపించుకోకపోతే ఆ ప్రభావం వారి మంత్రి పదవిపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వీరు తమ వారిని గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. వీరంతా దాదాపు అభ్యర్థులుగానే ప్రచారంలో తిరుగుతున్నారు. వారసులను గెలిపిస్తామన్న భరోసాతోనే టికెట్లు తీసుకున్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల తరఫున రోడ్డు షోలు, బహిరంగ సభలు, కార్యకర్తలతో సమావేశాలన్నీ మంత్రులే నిర్వహిస్తున్నారు.

రసవత్తరంగా మహా 'కుటుంబ' పోరు- బారామతిపైనే అందరి ఫోకస్​- రెండు వర్గాలకూ కీలకమే! - Lok Sabha Elections 2024

'జై జవాన్ జై కిసాన్‌' టు 'అబ్‌కీ బార్‌ చార్‌సౌ పార్‌'- సార్వత్రిక ఎన్నికల్లో టాప్​-10 స్లోగన్స్ ఇవే! - Lok Sabha Elections 2024

Last Updated : May 3, 2024, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details