Private Lander On Moon : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్ మెషీన్స్ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఆ సంస్థ ప్రయోగించిన ప్రైవేటు ల్యాండర్ ఒడిస్సస్ గురువారం చంద్రుడిపై అడుగుపెట్టింది. గతవారమే ఇంట్యూటివ్ మెషీన్స్ ఈ ల్యాండర్తో కూడిన రాకెట్ను ప్రయోగించింది. 1972లో అపోలో మిషన్ తర్వాత నాసా చేపట్టిన చంద్ర మండల యాత్ర ఇదే కావడం గమనార్హం.
'బలహీనంగా సంకేతాలు'
అయితే ల్యాండర్ నుంచి వచ్చే సంకేతాలు బలహీనంగా ఉన్నాయని ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిందని మాత్రం ధ్రువీకరణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ల్యాండర్ పరిస్థితి ఏంటి? ఏ ప్రాంతంలో ల్యాండ్ అయ్యిందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. చంద్రుడిపై దిగినట్లు ప్రకటించిన వెంటనే లైవ్ వెబ్క్యాస్ట్ను నిలిపివేసింది. ల్యాండర్ నుంచి వస్తున్న బలహీన సిగ్నల్స్ను ఎలా మెరుగుపర్చాలో విశ్లేషిస్తున్నామని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ టిమ్ క్రెయిన్ వెల్లడించారు.
50 ఏళ్ల తర్వాత!
దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగంతో అమెరికా చంద్రమండల యాత్ర చేపట్టినట్లయింది. మరోవైపు చంద్రుడి ఉపరితలంపైకి చేరిన తొలి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్ మెషీన్స్ నిలిచింది. గత నెలలో ఆస్ట్రోబోటిక్ ఆ దిశగా అడుగులు వేసినా విఫలమయ్యాయి. రోదసి యాత్రలను వాణిజ్యీకరించడంలో భాగంగా ఒడిస్సస్ ప్రయోగం కోసం ఇంట్యూటివ్కు నాసా 118 మిలియన్ డాలర్ల నిధులను అందించింది.