France Train Traffic: ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్వర్క్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొన్నిచోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేయగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడం, నిప్పు పెట్టడం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల నుంచి పారిస్కు రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఐరోపా నుంచి పారిస్కు సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఒలింపిక్స్ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
రైల్వే పట్టాలకు నిప్పు పెట్టి తప్పించుకుంటుండగా దుండగులను కొందరు స్థానికులు చూశారని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. రైల్వే పట్టాల వద్ద నిప్పును రాజేసే పరికరాలను గుర్తించినట్లు చెప్పారు. పశ్చిమ, తూర్పు, ఉత్తర ప్రాంతాల రైల్వే సేవలకు ఆటంకం కలిగిందని ఫ్రాన్స్ రైల్వే కంపెనీ SNCF తెలిపింది. రైళ్ల పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. రైల్వే పట్టాలపై మరమ్మతు పనులు చేపట్టామని పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. టికెట్ డబ్బులను చెల్లిస్తామని వెల్లడించింది.
మే నెలలో ఫ్రాన్స్ పోలీసులు ఓ చెచెన్ జాతీయుడిని అరెస్టు చేశారు. పారిస్ ఒలింపిక్స్లో సాకర్ గేమ్ సందర్భంగా ప్రేక్షకులు, భద్రతా దళాలపై ఆత్మహుతి దాడి చేయాలని అతడు ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నెలలో ఛాంపియన్స్ లీగ్పై డ్రోన్తో దాడి చేస్తామని ఐసీఎస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రసంస్థ ఒలింపిక్స్ను టార్గెట్ చేసుకొనే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గత తొమ్మిది నెలల్లో ఐరోపాలో ఐసిస్ సంబంధిత అరెస్టుల్లో మూడింట రెండొంతులు టీనేజర్లు ఉన్నారు. ముఖ్యంగా ఆ ఉగ్ర సంస్థ ఖోరసాన్ విభాగం తుర్కియోలో బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొంది. ఆ దేశ ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లెక్కల ప్రకారం 2023లో 426 ఐసిస్-కె అనుమానితులను అరెస్టు చేశారు.