తెలంగాణ

telangana

నదిలో పడ్డ రెండు బస్సులు- 65మంది మిస్సింగ్- టెన్షన్​ టెన్షన్​! - Buses Swept Away

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 9:00 AM IST

Updated : Jul 12, 2024, 9:34 AM IST

Nepal Landslide Today : జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటం వల్ల రెండు బస్సులు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నేపాల్​లో జరిగిందీ ఘటన.

Nepal Landslide Today
Nepal Landslide Today (ANI)

Nepal Landslide Today :నేపాల్​లో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడడం వల్ల త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ నేపాల్‌ చిత్వాన్ జిల్లాలోని నారాయణ్‌ ఘాట్- ముగ్లింగ్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడిన కొండచరియలను తొలగించారు.

వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
కాగా, త్రిశూలి నదిలో బస్సులు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆచూకీ కోసం సిబ్బంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా గాలిస్తున్నారు. నేపాల్ రాజధాని కాఠ్​మాండూ నుంచి రౌతహత్ గౌర్​కు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో మిగతా వారు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గణపతి డీలక్స్‌ బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాద సమయంలో వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.

విచారం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని
ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని రెస్క్యూ టీమ్, అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కోరారు.

ఘటనాస్థలికి పోలీసులు, సాయుధ బలగాలు
మరోవైపు, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి వెళ్లాయని పోలీసు సూపరింటెండెంట్ భావేశ్ రిమల్ తెలిపారు. నారాయణ్ ఘాట్‌- మగ్లింగ్‌ రోడ్డు సెక్షన్​లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాఠ్ మాండూ నుంచి చిత్వాన్​లోని భరత్‌ పుర్​కు వెళ్లే అన్ని విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. కాగా, వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడడం, వరదలు కారణంగా గత దశాబ్ద కాలంలో నేపాల్​లో దాదాపుగా 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మంది గల్లంతవ్వగా, 1,500 మందికి పైగా గాయపడ్డారు.

పాల ట్యాంకర్​ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు- 18 మంది స్పాట్ డెడ్- ముర్ము సంతాపం - Road Accident Today

హాథ్రస్ తొక్కిసలాటలో సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులు- కుట్రకోణం లేదని చెప్పలేం : సిట్ నివేదిక - Hathras Stampede

Last Updated : Jul 12, 2024, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details