తెలంగాణ

telangana

ETV Bharat / international

సెంట్రల్​ బీరుట్​పై ఇజ్రాయెల్ దాడి - 22 మంది మృతి, 117 మందికి తీవ్ర గాయాలు - ISRAELI AIRSTRIKES IN BEIRUT

Israel Iran War News Updates : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇజ్రాయెల్​ గురువారం లెబనాన్​లోని సెంట్రల్​ బీరుట్​పై చేసిన వైమానిక దాడిలో 22మంది మరణించగా, 117మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

Israeli strike in Lebanon kills 22
Israeli strike in Lebanon kills 22 (AP)

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 8:33 AM IST

Israel Iran War News Updates :ఇజ్రాయెల్ గురువారం లెబనాన్​లోని సెంట్రల్​ బీరుట్​పై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది మరణించగా, 117 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లెబనాన్​లోని ఇరాన్​ మద్దతు కలిగిన హెజ్​బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని సమాచారం.

పశ్చిమ బీరుట్​లోని వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో రెండు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. దీనితో అక్కడి వాతావరణం భీతవహంగా మారింది.

పీస్​కీపర్స్​పై దాడి
మరోవైపు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పీస్​కీపర్స్​ గాయపడినట్లు తెలుస్తోంది. యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో తీవ్రంగా ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ దాడులపై వాషింగ్టన్‌ సైతం స్పందించింది. హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు చేసే సమయంలో, యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో యూఎన్‌ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్‌ సూచించింది.

స్కూల్​పై ఇజ్రాయెల్‌ దాడి - 28 మంది మృతి
ఇంతకు ముందు సెంట్రల్‌ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 28 మంది మరణించారు. మరో 54 మంది గాయపడ్డారు. దీనితో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 2,169కి పెరిగింది.

భయం గుప్పిట్లో
ఉత్తర గాజాలో సుమారు 4 లక్షల మంది భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాయపడిన వేలాది మందితో అక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నట్లు పేర్కొంది. పైగా సదరు ఆసుపత్రుల్లో సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా ఉన్నాయని వెల్లడించింది. నిరాశ్రయులైన మహిళలు, చిన్నారులు సదరు ఆసుపత్రుల్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు ఐరాస తెలిపింది.

స్కూల్​పై ఇజ్రాయెల్‌ దాడి- 28 మంది మృతి- భయం గుప్పిట్లో 4 లక్షల మంది!

బీరుట్​పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్- భీకర దాడుల్లో 25మంది మృతి- 127మందికి పైగా! - Israel Hezbollah War

ABOUT THE AUTHOR

...view details