తెలంగాణ

telangana

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్​- శరణార్థి శిబిరాలే టార్గెట్- 100మంది మృతి

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 7:22 AM IST

Israel Hamas War Latest Update : వైమానిక, భూతల దాడులతో గాజా స్ట్రిప్​పై మరోసారి ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడింది. గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 100 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.

Israel Hamas War Latest Update
Israel Hamas War Latest Update

Israel Hamas War Latest Update :గాజా స్ట్రిప్​లో ఇజ్రాయెల్ బలగాలు దాడులు మరింత తీవ్రం చేస్తున్నాయి. గురువారం ఇజ్రాయెల్ సేనలు జరిపిన వైమానిక, భూతల దాడుల్లో 100 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దక్షిణ గాజాలోని రఫా నగరం, మధ్య గాజాలోని దెయిర్ అల్ బలాహ్, నుస్సేరత్ శరణార్థి శిబిరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ బాంబులతో విరుచుకుపడింది.

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

మృతదేహాలతో నిండిన ఆస్పత్రి!
దాడుల కారణంగా మృతదేహాలు, క్షతగాత్రులతో అల్ అక్సా ఆస్పత్రి నిండిపోయింది. అటు గాజాలో హమాస్​తో పోరాడుతున్న ఇజ్రాయెల్ యుద్ధంతో సంబంధం లేని పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్​లో సెటిల్ మెంట్లను పెంచుకుంటోంది. వెస్ట్ బ్యాంక్​లో 3,300 కొత్త ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని అమెరికా ఖండించింది. కొత్త ఆక్రమణలు చేయవద్దని, గతంలోనే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసింది.

ఆస్పత్రిలో క్షతగాత్రుడు

'మా నియంత్రణలోనే గాజా'
అయితే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గురువారం కీలక పత్రాన్ని తన వార్‌ కేబినెట్‌ ముందు ప్రవేశపెట్టారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎలా నియంత్రించాలన్న ప్రణాళికను ఆ పత్రంలో వివరించారు. గాజాను నిస్సైనికీకరణ చేస్తామని, భద్రతతో పాటు పాలనా వ్యవహారాలను కూడా తమ చేతుల్లో తీసుకుంటామని పేర్కొన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజా సహా జోర్డాన్‌ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్‌ చేతిలో ఉంటుందని ప్రతిపాదించారు.

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

ఉగ్రవాద దేశంతో సంబంధాలు లేనివారితోనే!
పాలస్తీనాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడాన్ని నెతన్యాహు తోసిపుచ్చారు. పాలస్తీనియన్లతో పరిష్కారం అనేది రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. రఫా క్రాసింగ్‌తోపాటు స్థానికంగా స్మగ్లింగ్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈజిప్టు, అమెరికాలకు సహకరిస్తామని చెప్పారు. గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్‌ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని సూచించారు. ఉగ్రవాద దేశం లేదా గ్రూపులతో సంబంధం లేనివారితోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు.

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు- 71 మంది మృతి- సగం మంది మహిళలు, చిన్నారులే

ఐరాస ఆఫీస్​ కింద హమాస్‌ భారీ సొరంగం- విద్యుత్​, ఆయుధాలతో 18 మీటర్ల లోతులో నిర్మాణం!

ABOUT THE AUTHOR

...view details