తెలంగాణ

telangana

ETV Bharat / international

క్యాన్సర్‌ బారిన పడిన బ్రిటన్‌ రాజు- బహిరంగ కార్యక్రమాలకు దూరం - బ్రిటన్‌ రాజుకు క్యాన్సర్‌

British King Charles 3 Cancer : 75 ఏళ్ల బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయిందని బకింగ్‌హామ్​ ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని వెల్లడించింది.

British King Charles 3
British King Charles 3

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 6:44 AM IST

Updated : Feb 6, 2024, 11:18 AM IST

British King Charles 3 Cancer :బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఓ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం ప్రకటించింది. ఇది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ విషయం బయటపడిందని పేర్కొంది. క్యాన్సర్ రకం గురించి అధికారికంగా చెప్పనప్పటికీ 75 ఏళ్ల రాజు ఛార్లెస్-3 సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది.

అధికారిక పనులకు దూరం!
వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారనీ చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్​ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022 సెప్టెంబరు​లో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్​-3 బ్రిటన్​ రాజుగా ఎన్నికయ్యారు.

జనవరి 29న లండన్​ క్లినిక్​ నుంచి డిశ్ఛార్జ్​ అయిన తర్వాత ఆదివారం నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్‌లో ఉన్న చర్చిలో కనిపించారు రాజు ఛార్లెస్​-3. అక్కడ భార్య రాణి కెమిల్లాతో కలిసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయనకు క్యాన్సర్​ సోకిందని నిర్ధరణ కావడం వల్ల సాండ్రింగ్‌హామ్​ నుంచి లండన్​కు బయలుదేరారు. ప్రస్తుతం లండన్‌లోని తన ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు.

ఛార్లెస్​-3 దంపతులకు ఇద్దరు కుమారులు(విలియం, హ్యారీ), ఒక కుమార్తె(ప్రిన్స్ విలియం) ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కుమారుడు ప్రిన్స్​ హ్యారీ తన తండ్రిని పరామర్శించేందుకు త్వరలోనే యూకేకు చేరుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఛార్లెస్​-3 కోడలు, ప్రిన్సెస్​ ఆఫ్​ వేల్స్​ కేట్​ ఉదర సంబంధిత వ్యాధి నుంచి కోలుకున్నారు.

దేశాధినేతల స్పందన!
ఛార్లెస్​-3 క్యాన్సర్​ బారిన పడడంపై బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్ ఎక్స్​ వేదికగా స్పందించారు. 'మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది' అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో పాటు బ్రిటన్​ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్​ కూడా ఎక్స్​ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

'త్వరలోనే రాజుతో మాట్లాడతా'
'రాజు ఛార్లెస్​-3 క్యాన్సర్​ బారిన పడ్డారని తెలిసింది. ఇది విచారించాల్సిన విషయం. నేను త్వరలోనే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. యూఎస్​ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కూడా ఛార్లెస్​-3 ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనతో ఛార్లెస్​కు మంచి సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్​ రాజు ఛార్లెస్-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎక్స్​లో పోస్ట్ చేశారు.

భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!

డేట్​కు వెళ్లి 'మెమొరీ' కార్డ్ చోరీ- 4ఏళ్ల తర్వాత వెలుగులోకి జంట హత్యలు- చివరకు!

Last Updated : Feb 6, 2024, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details