తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ దేశాధినేతలతో మోదీ కీలక భేటీలు- భారత్​తో సంబంధాలపై చర్చలు - G20 SUMMIT 2024

జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ- బ్రిటన్, ఇటలీ, ఇండోనేసియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాధినేతలతో సమావేశాలు

PM Modi G20 Summit
PM Modi G20 Summit (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 11:08 AM IST

PM Modi G20 Summit : బ్రెజిల్‌లోని రియో డి జనిరో వేదికగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో బ్రిటన్, ఇటలీ, ఇండోనేసియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. భారత్​తో సంబంధాలపై వారితో చర్చించారు.

'బ్రిటన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం'
"రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్‌ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్‌ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నాం" అని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తో చర్చలు అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. మరోవైపు, భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరుదేశాల పరస్పర సహకారంపై ప్రధాని మోదీ, కీర్‌ స్టార్మర్‌ చర్చించుకున్నారని ఎక్స్ పోస్టులో తెలిపింది.

'భారత్ తో వాణిజ్య చర్చలకు యూకే రెడీ'
భారత్​తో యూకే ఒక కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని 10 డౌన్ స్ట్రీట్ ఓ ప్రకటన విడుదల చేసింది. భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో భారత్ సాయాన్ని కోరుకుంటున్నామని తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్​తో వాణిజ్య ఒప్పంద చర్చలకు యూకే కట్టుబడి ఉందని ప్రకటనలో పేర్కొంది.

మరోసారి 'మెలోడీ' మూమెంట్
అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. "రియో డీ జెనీరోలో జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీంతో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించాం" అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇక మోదీ, జార్జియా మెలోనీ కలిసి దిగే ఫొటోలు మెలోడీ (మెలోనీ+మోదీ) పేరిట పలుమార్లు ట్రెండ్‌ అయ్యాయి. తాజాగా జీ20 వేదికగా ఈ 'మెలోడీ' మూమెంట్‌ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది.

ఇండోనేసియా అధ్యక్షుడితో చర్చలు
ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భద్రత, ఆరోగ్య సంరక్షణ గురించి ప్రబోవోతో చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడిని కలవడం ఆనందంగా ఉందని ఎక్స్​లో పోస్టు చేశారు. "ఈ ఏడాదికి భారత్- ఇండోనేసియాకు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇరుదేశాల దౌత్యసంబంధాలపై చర్చించుకున్నాం. వాణిజ్యం, భద్రత, ఆరోగ్య సంరక్షణలో సంబంధాలను మెరుగుపరచడంపై చర్చలు జరిపాం." అని పోస్టులో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

'ఫలప్రదమైన సమావేశం జరిగింది'
పోర్చుగల్ ప్రధాని లూయిస్ మోంటెనెగ్రోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. "పోర్చుగల్ ప్రధానితో ఫలప్రదమైన సమావేశం జరిగింది. భారత్ కు పోర్చుగల్ తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, బలమైన రక్షణ సంబంధాలపై చర్చలు జరిపాం" అని మోదీ పోస్టు చేశారు.

మెక్రాన్​తో మోదీ చర్చలు
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. " ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను కలవడం సంతోషంగా ఉంది. భారత్‌, ఫ్రాన్స్‌ అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తాం" అని మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

అలాగే నార్వే ప్రధాని జోనాస్ గహర్‌, ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ ను ప్రధాని మోదీ కలిసి పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల నైజీరియా పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్​లో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details