Bangladesh Violence Today :రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు బుల్లెట్లు, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. అలాగే దేశ రాజధాని ఢాకాలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను శుక్రవారం నిలిపివేశారు. వారం క్రితం ప్రారంభమైన ఈ నిరసనలు గురువారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ హింసాత్మకమైంది. దీంతో ఘర్షణల్లో 22 మంది మరణించగా, వేలాది మందికి గాయపడ్డారు. అలాగే శుక్రవారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా తెలిపింది.
వారికి రిజర్వేషన్లు తొలగించాలని నిరసనలు
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లలో 30శాతం కోటా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు రెచ్చిపోయారు. వారిని అదుపు చేయడానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢాకాలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. శుక్రవారం కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, ఇతర సేవలకు అంతరాయం కలిగింది.