తెలంగాణ

telangana

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్​ - Yunus as head of Bangladesh govt

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 7:05 AM IST

Muhammad Yunus Bangladesh Interim Govt Chief : బంగ్లాదేశ్​లో రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల నేపథ్యంలో ఆదేశ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేశారు. ఆ దేశ తాత్కలిక ప్రభుత్వ సారథిగా, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ను నియమిస్తూ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు. వాస్తవానికి యూనస్‌ అభ్యర్థిత్వాన్ని నిరసన కారులే ప్రతిపాదించారు.

Muhammad Yunus
Muhammad Yunus (ETV Bharat)

Bangladesh Interim Government :బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా వైదొలగాల్సి రావడంతో, అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, అనంతరం కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు.

మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌ ప్రభుత్వాధినేతగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు. యూనస్‌ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేశారు. చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఫ్రోపెసర్ సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. 1940లో చిట్టగాంగ్‌లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్‌ బ్యాంక్‌ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ఆయన సాధించారు.

యూనస్‌పై అనేక కేసులు : ఆయన సేవలకు గాను 2006లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు. అల్లర్ల నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్‌లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్‌. తాత్కాలిక బంగ్లాదేశ్‌ ప్రభుత్వ సారథి పేరునూ నిరసన కారులే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని నిరసన కారులు స్పష్టం చేశారు. హసీనా సర్కారుతో ఘర్షణపడినందుకు యూనస్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అయితే సుమారు ఆరు నెలల జైలుశిక్ష పడింది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్‌ వెల్లడించారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించినట్లైందని ఆయన వ్యాఖ్యానించారు.

దేశం వీడి వెళ్లిన నేతలు బంగ్లాదేశ్‌ సైన్యంలో మేజర్‌ జనరల్‌ జియావుల్‌ అహ్‌సాన్‌పై వేటుపడింది. మరికొందరు లెఫ్టినెంట్‌ జనరళ్లనూ వారివారి స్థానాల నుంచి తొలగించారు. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌తోపాటుగా విదేశాంగ మాజీ మంత్రి హసన్‌ మహమూద్‌ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా మహమూద్‌ భారత్‌కు వెళ్లాలని తొలుత విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. అల్లర్ల నేపథ్యంలో ప్రధాని హసీనాకంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హసీనాతో పాటుగా ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహబూబ్‌ ఉద్దీన్‌ ఖొఖోన్‌ భారతదేశాన్ని కోరారు.

ప్రార్థనామందిరాలపై దాడులు : జషోర్‌ జిల్లాలోని అవామీలీగ్‌ నేతకు చెందిన ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పు అంటించారు. ఈ ఘటనలో మంగళవారం నాటికి 24 మంది మృతి చెందారు. గత మూడువారాలుగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 440 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 109 మంది మృతిచెందారు. హిందువులు, ఇతర మైనారిటీల ప్రార్థన మందిరాలు ఇళ్లు, దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. కనీసం ఇద్దరు హిందూ నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. కోల్‌కతా-ఢాకా బస్సు సర్వీసులను అధికారులు ఆపేశారు. భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య రైళ్లను నిరవధికంగా రద్దుచేశారు. విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించారు. బంగ్లాదేశ్‌కు ప్రయాణాలు చేయవద్దని అమెరికా తమ పౌరుల్ని హెచ్చరించింది. కొన్నిరోజులుగా మూసివేసిన పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలు మంగళవారం తెరచుకున్నాయి. ప్రజారవాణా వ్యవస్థ పనిచేస్తోంది.

డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి ఖరారు- టిమ్‌ వాల్జ్​ను ఎంచుకున్న కమల హారిస్ - Democrats Vice President Candidate

'అలా చేస్తే బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది' - హసీనా కుమారుడు సంచనల కామెంట్స్! - Bangladesh Crisis

ABOUT THE AUTHOR

...view details