Akash Bobba Joins DOGE :ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ టీమ్లోకి భారత సంతతి యువకుడు ఆకాశ్ బొబ్బ చేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు అప్పగించారు. తాజాగా ఈ డోజ్ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు అతడి పేరు నెట్టింట వైరల్ అయ్యింది.
అందరూ యువకులే!
డోజ్ నియమించుకున్న ఆరుగురు కూడా 19 నుంచి 24 ఏళ్లలోపు వయస్సున్న యువకులేనని ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా, ఓ యువకుడు ఇంకా చదువుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ టీమ్లోకి తీసుకోవడం అగ్రరాజ్యంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన డేటాను సైతం తెలుసుకునేందుకు డోజ్కు అనుమతి ఉంది. అందుకే ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.