Health Tips for Winter Season:శీతాకాలం వచ్చిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. జలుబు, దగ్గు నుంచి ఆస్థమా వరకు అనేక సమస్యలకు ఇబ్బందులు పెడతాయి. చర్మం ఎక్కువగా పొడిబారడం, పగుళ్లు ఏర్పడడం, విటమిన్ లోపాలు ఏర్పడతాయి. ఇంకా జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడేమే కాకుండా.. ఊపిరితిత్తలు సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి శీతాకాలాన్ని జబ్బులకు దూరంగా గడపాలని అనుకుంటారు. మరి అలా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"శీతాకాలంలో ప్రధానంగా ముక్కు దిబ్బడం, ఆయాసం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ముక్కులో నాజిల్ డ్రాప్స్ వేసుకోవాలి. ఆయాసం, దమ్ము వచ్చేవారు ఇన్ హెల్లర్స్ వాడాలి. గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కలిపిన గోరు వెచ్చటి నీటిని పుకిలించాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్లు బయటకు పోతాయి."
--డాక్టర్ ప్రమోద్ కుమార్, జనరల్ ఫిజీషియన్
అందం, ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించడం వల్ల శీతాకాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో దాహం పెద్దగా కాకపోయినా.. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు. చర్మానికి తేమ అవసరం కాబట్టి.. ఈ సమయంలో చర్మ రక్షణకు అన్ని రకాల చర్మాల వారు మాయిశ్చరైజర్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు. ఇంకా కురుల సంరక్షణకు మార్కెట్లో దొరికే నూనెలను రాత్రి పూట పట్టించి ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఈ సమయంలో పెదాలు కూడా పగిలే అవకాశం ఉన్నందున.. లిప్ బామ్లు రాసుకోవాలని పేర్కొన్నారు. సాధారణ క్రీముల కంటే శీతాకాలంలో ఎక్కువ మాయిశ్చరైజర్లు ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
- వేడి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి.
- స్నానం చేసిన 15 నిమిషాల తర్వాత లోషన్లు, మాయిశ్చరైజర్లు చర్మానికి పెట్టుకోవాలి.
- బయటకు వెళ్లి వ్యాయామం చేయలేని వారు ఇంట్లోనే వాకింగ్, యోగా లాంటివి చేయాలి.
- పాదాలు పొడిబారడం, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలు ఉంచాలి.
- బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి.