Tips to Avoid Stress in Students During Exams:ఫిబ్రవరి నుంచి మే వరకు పిల్లలకు పరీక్షా కాలం. సాధారణంగా ఎగ్జామ్స్ అంటేనే చాలా మంది పిల్లలు భయపడుతుంటారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ పరీక్షలంటే ఉన్న భయం పోదు. చదివింది గుర్తుండటం లేదని, పరీక్షలు రాసే సమయానికిఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పరీక్షల వేళ పిల్లలు అటు పెద్దలు పరేషాన్ కాకుండా ఉండేందుకు ఈ టిప్స్ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో స్టేట్ టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కీలకం. ఏదిపడితే అది తింటే పరీక్షల వేళ అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు.
నిద్రపోకుండా చదవడం సరికాదు: ఎగ్జామ్స్ అంటే చాలా మంది విద్యార్థులు తిండి, నిద్ర మానేసి టైమ్తో పనిలేకుండా చదువుతుంటారు. ఎంత ఎక్కువ చదివితే అన్ని మంచి మార్కులు వస్తాయనే భావనలో ఉంటారు. అయితే ఇలా తిండి, నిద్ర మానేసి చదవడం మంచిది కాదని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకియాట్రిస్టు డాక్టర్ అనిత అంటున్నారు.
- టైం టేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలని, ఏకధాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడం అవసరమంటున్నారు.
- రాత్రి మొత్తం చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, చదివింది మెదడుకు ఎక్కదని, ఫలితంగా అనవసర ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. కాబట్టి రోజూ కనీసం 7-8 గంటలపాటు నిద్ర తప్పనిసరని సూచిస్తున్నారు.
- ఎంత ప్రణాళిక వేసుకున్నా సరే కొందరికి పరీక్షలంటే భయం. ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.