Reliance Jio Free Cloud Storage Offer :రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్ స్టోరేజ్ను (Jio Cloud Storage) వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దీనితో ఈ విభాగంలో మార్కెట్ లీడర్లుగా ఉన్న గూగుల్, యాపిల్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. కనుక క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో గూగుల్ వన్, యాపిల్ ఐక్లౌడ్ (iCloud) సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సమస్య తీరినట్లేనా?
ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు చాలా స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో ఎక్కువ మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న 15 జీబీ డేటా పరిమితి కాగానే, అదనపు స్టోరేజ్ కోసం గూగుల్ వన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్ వన్ 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ధర నెలకు రూ.130 ఉంది. యాపిల్ కంపెనీకి చెందిన 'ఐక్లౌడ్' 50 జీబీ స్టోరేజ్ ధర రూ.75గా ఉంది. జియో ఎంట్రీతో ఈ రెండింటి ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అంబానీ క్లౌడ్ సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటల్ కంటెంట్ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజ్ను తీసుకురాబోతున్నాం. వెల్కమ్ ఆఫర్ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందించనున్నాం. ఇంకా ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ కావాలనుకునే వాళ్లకి అందుబాటు ధరల్లోనే దానిని అందిస్తాం" అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.